లండన్: పాకిస్తాన్ క్రికెట్ జట్టు చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరడంతో ఆ దేశ అభిమానులు అత్యుత్యాహం ప్రదర్శించారు. అది దారి తప్పి భారత్పై ఆగ్రహంగా వ్యక్తమైంది. తమ దేశం క్రికెట్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించిన ఉత్సాహంలో పాక్ క్రికెట్ అభిమానులు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీపై దాడికి పూనుకున్నారు.
ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సౌరవ్ గంగూలీ తన కారులో ప్రయాణిస్తుండగా వారు అడ్డు పడ్డారు. దాంతో ఆగకుండా కారుపైకి ఎక్కారు. ఆ తర్వాత దాడి చేయడానికి పూనుకున్నారు. పాకిస్తాన్ జిందాబాద్, ఇండియా ముర్దాబాద్ అంటూ నినాదాలు చేశారు.
పాకిస్తాన్ జెండాను చేతుల్లో ధరించి గంగూలీ కారును కదలకుండా చేశారు. అయితే, కారులోపలి నుంచి గంగూలీ చిరునవ్వులు చిందించారు. కాసేపటి తర్వాత వాతావరణం చల్లబడడంతో గంగూలీ తన దారిన తాను వెళ్లిపోయారు.
ఈ నెల 1వ తేదీన జరిగిన సైమీ ఫైనల్ మ్యాచులో పాకిస్తాన్ ఆతిథ్య ఇంగ్లాండు జట్టును ఓడించి ఫైనల్లోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. తమ చిరకాల ప్రత్యర్థి భారత్ జట్టుతో ఫైనల్లో ఆదివారంనాడు తలపడబోతోంది.