న్యూఢిల్లీ: 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత టెస్టు జట్టులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ పార్ధీవ్ పటేల్ తిరిగి చోటు దక్కించుకున్నాడు. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఇంగ్లాండ్తో మొహాలిలో జరగనున్న మూడో టెస్టుకి రెగ్యులర్ వికెట్ కీపర్ వర్ధమాన్ సాహా స్ధానంలో పార్ధీవ్ పటేల్ ఎంపికయ్యాడు.
ఇంగ్లాండ్తో జరిగే మిగిలిన మూడు టెస్టులకు బీసీసీఐ మంగళవారం 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా జట్టులో ఒక మార్పు చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. వికెట్ కీపర్ సాహా స్థానంలో పార్థీవ్ పటేల్కు చోటు కల్పించింది. ఈ మార్పు మొహాలీ వేదికగా జరిగే మూడో టెస్టుకు మాత్రమే అని బీసీసీఐ ట్విటర్లో పేర్కొంది.
NEWS ALERT - @parthiv9 replaces injured @Wriddhipops for the Mohali Test @Paytm #INDvENG pic.twitter.com/vnhe5q1ZtU
— BCCI (@BCCI) November 23, 2016
టెస్టు క్రికెట్కి ధోని వీడ్కోలు పలికిన తర్వాత వికెట్ కీపర్గా వర్ధమాన్ సాహా భారత జట్టుకు విశేష సేవలందిస్తున్నాడు. అయితే ఇంగ్లాండ్తో విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో టెస్టులో వర్ధమాన్ సాహా గాయం పాలయ్యాడు. దీనిని బీసీసీఐ మెడికల్ టీమ్ కూడా అధికారికంగా ధృవీకరించింది.
ఇంగ్లాండ్తో ఈ నెల 26 నుంచి జరగనున్న మూడో టెస్టులో వర్ధమాన్ సాహా ఆడటం లేదని, అతడి స్ధానంలో జట్టులోకి పార్ధీవ్ పటేల్ని తీసుకుంటున్నట్లు బీసీసీఐ సెక్రటరీ అజయే షిర్కే అధికారిక ప్రకటనలో వెల్లడించారు. సాహా గాయం బారిన పడటంతో ఈ మార్పు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.
31 ఏళ్ల పార్ధీవ్ పటేల్ టీమిండియా తరుపున తన ఆఖరి టెస్టు మ్యాచ్ 2008లో శ్రీలంకపై ఆడాడు. గుజరాత్కు చెందిన పార్ధీవ్ పటేల్ 17 ఏళ్ల వయసులోనే 2002లో ఇంగ్లాండ్ జట్టుపై అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. భారత్ తరుపున 20 టెస్టు మ్యాచ్లాడిన పార్ధీవ్ పటేల్ 30 ఇన్నింగ్స్ల్లో 683 పరుగులు చేశాడు.
తాను ఆడిన 20 టెస్టుల్లో 41 క్యాచ్లు పట్టగా 8 స్టంపింగ్స్లు చేశాడు. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరిస్లోకి పార్ధీవ్ పటేల్ను ఎంపిక చేయడంపై క్రీడా విశ్లేషకులు నివ్వెర పోయారు.