అంటిగ్వా, బర్బుడా: వెస్టిండీస్ క్రికెట్లో ఏర్పడిన సంక్షోభం ముగిసింది. వెస్టిండీస్ బోర్డు 12మంది ఆటగాళ్లలతో కాంట్రాక్టులపై సంతకాలు చేయించుకుంది. భారతదేశంలో జరిగే ప్రపంచ ట్వంటీ20లో ఆడేందుకు ఈ ఆటగాళ్లందరూ అంగీకరించారు.
గడువు తేదీ అయిన ఆదివారం(ఫిబ్రవరి 14) నాటికి ఆటగాళ్లు కాంట్రాక్ట్లకు ఒప్పుకోకుంటే వారికి జట్టు నుంచి ఉద్వాసన పలుకుతామని విండీస్ బోర్డు హెచ్చరించిన నేపథ్యంలో ఆటగాళ్లు సంతకాలు చేసినట్లు తెలుస్తోంది. కాగా, డారెన్ బ్రావో మాత్రం తాను వన్డేల్లో మాత్రమే ఆడతానని తేల్చి చెప్పడంతో టీ20 ప్రపంచ కప్ టోర్నీకి దూరమయ్యాడు.
స్టార్ బ్యాట్స్మన్ క్రిస్ గేల్ తోపాటు కెప్టెన్ డారెన్ సమీ, సులేమాన్ బెన్, జాసన్ హోల్డర్, ఆండ్రే ఫ్లెచర్, డ్వేన్ బ్రేవో, సామ్యుల్ బద్రీ, లెండి సిమన్స్, జెరోమి టేలర్, ఆండ్రూ రస్సెల్, మార్లన్ సామ్యుల్స్, దినేష్ రామదిన్లు కంట్రాక్ట్పై సంతకాలు చేశారని వెస్టిండీస్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
అయితే, సునీల్ నరేన్, కీరన్ పొలార్డ్ తర్వాత డారెన్ బ్రావో కూడా టీ20 ప్రపంచ కప్ జట్టు నుంచి వైదొలిగాడు. వైదొలగడానికి వారు సరైన కారణం చెప్పలేదు. కాగా, సునీల్ నరేన్, కీరన్ పొలార్డ్ స్థానంలో అశ్లే నర్స్, కార్లోస్ బ్రత్వేట్ లను జట్టులోకి తీసుకుంటున్నట్లు విండీస్ బోర్డు పేర్కొంది.
గాయం కారణంగానే పొలార్డ్ టోర్నీకి దూరమయ్యాడని బోర్డు తెలిపింది. తాను సరైన రీతిలో ప్రాక్టీస్ చేయనందున టోర్నీలో ఆడట్లేదని నరేన్ చెప్పినట్లు విండీస్ బోర్డు పేర్కొంది. కాగా, బ్రావో మాత్రం ఇకపై 50ఓవర్ల మ్యాచుల్లోనే ఆడతానని చెప్పాడని వెల్లడించింది.
'ప్రపంచ కప్ టోర్నీకి తనను ఎంపిక చేసినందుకు బోర్డు నా ధన్యవాదాలు. కానీ, నేను టీ20 మ్యాచులు ఇకపై ఆడాలని అనుకోవట్లేదు. 50ఓవర్ల మ్యాచులపైనే పూర్తి దృష్టి సారిస్తా' అని బ్రావో తెలిపాడు. ఆటగాళ్లు, బోర్డు మధ్య విభేదాలు తొలగిపోవడంతో వచ్చే టీ20 ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్ జట్టు పాల్గొననుంది.
టీ20 ప్రపంచ కప్ టోర్నీకి వెస్టిండీస్ జట్టు: డారెన్ సమీ(కెప్టెన్), సులేమాన్ బన్, జాసన్ హోల్డర్, ఆండ్రూ ఫ్లెచర్, డ్వేన్ బ్రేవో, సామ్యుల్ బద్రీ, లెండీ సిమన్స్, జెరోమ్ టేలర్, అండ్రూ రస్సెల్, మార్లన్ సిమ్యుల్స్, డెనెష్ రామదిన్, క్రిస్ గేల్, అశ్లే నర్స్, కార్లో బ్రత్వేట్.