హైదరాబాద్: భారత్-పాక్ల మధ్య క్రికెట్ పునరుద్ధరణకు తన శక్తి మేరకు ప్రయత్నిస్తానని పాకిస్ధాన్ క్రికెట్ బోర్డు కొత్త అధ్యక్షుడు నజామ్ సేథీ వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా నజామ్ సేథీ బుధవారం ఎన్నికయ్యారు. ఈ పదవిలో ఆయన మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నారు.
షహర్యార్ ఖాన్ స్థానంలో సేథీ బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం నిర్వహించిన సమావేశంలో పీసీబీ బోర్డు గవర్నర్లు సేథీని కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్తో క్రికెట్ ఆడటంపై తాను డోర్లను మూసివేయలేదు. రాబాయే రోజుల్లా భారత్, పాక్ల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని, పాక్తో ద్వైపాక్షిక సిరిస్ కోసం బీసీసీఐ అ దేశ ప్రభుత్వాన్ని ఒప్పిస్తుందన్న నమ్మకం ఉంది' అని ఆయన అన్నారు.
అదే విధంగా బీసీసీఐ నుంచి రావాల్సిన నష్టపరిహారం కోసం ఐసీసీని సంప్రదిస్తూనే ఉంటామని అన్నారు. భారత్ వేదికగా జరగనున్న అండర్-19 ఆసియాకప్ వేదికను భారత్ నుంచి తరలించాలని పీసీబీ డిమాండ్ చేస్తోంది. నవంబరులో బెంగళూరులో అండర్-19 ఆసియా కప్ పోటీలు జరగనున్నాయి.
ఈ టోర్నీని భారత్లో నిర్వహించడం వల్ల తమకు ఇబ్బందులు తలెత్తుతాయని, దీనిని దృష్టిలో పెట్టుకుని భారత్ నుంచి టోర్నీని తరలించాలని పీసీబీ అధికారులు ఆసియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ)కి నజామ్ సేథీ విన్నవించేందుకు సిద్ధమయ్యారు. కొలంబోలో త్వరలో జరగనున్న సమావేశంలో తమ సమస్యలను ఏసీసీ దృష్టికి తీసుకువస్తామని ఆయన అన్నారు.
సేథీ నియామకం పట్ల పలువురు మాజీ పాక్ ఆటగాళ్లు సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ క్రికెట్ లీగ్(పీకేఎల్)ను విజయవంతం చేయడంలో సేథీ కీలక పాత్ర పోషించారని వసీం అక్రమ్ తెలిపాడు. ఇదిలా ఉంటే పీసీబీ అధ్యక్ష పదవికి నజామ్ సేథీ పేరుని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఇక, ఇప్పటి వరకు బోర్డులో గవర్నర్గా ఉన్న సేథీ స్థానంలో ఆరీఫ్ ఇజాజ్ని నియమించారు.