హైదరాబాద్: అవినీతి ఆరోపణల కారణంగా పాకిస్థాన్కు చెందిన ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్లపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వేటు వేసింది. దుబాయిలో జరుగుతున్న పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో అవినీతికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలడంతో వీరిద్దరిపై వేటు వేసినట్లు పీసీబీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఖలీద్ లతీఫ్, షర్జిల్ ఖాన్లు స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఐసీసీ సహకారంతో విచారణ చేపట్టిన పీసీబీ, వారిద్దరికీ ఫిక్సింగ్తో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో సస్పెన్షన్ వేటు వేసింది. అయితే వీరిద్దరూ ఫిక్సింగ్కు పాల్పడిన ఎటువంటి ఆధారాలను మాత్రం పీసీబీ వెల్లడించలేదు.
అయితే పీసీబీ సస్పెన్షన్ విధించిన ఇద్దరు ఆటగాళ్లు కూడా పాకిస్థాన్ జాతీయ జట్టుకు చెందిన క్రికెటర్లు కావడం విశేషం. ఓపెనర్ షర్జిల్ ఖాన్ ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన పాక్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. అంతేకాదు ఆస్ట్రేలియా పర్యటనలో పాక్ తరుపున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు కూడా షర్జిల్ ఖానే.
పాకిస్థాన్ జట్టు తరుపున ఇప్పిటి వరకు 25 వన్డేలు, 15 ట్వంటీ 20లు ఆడాడు. ఇక లతిఫ్ విషయానికి వస్తే గతేడాది ఐసీసీ వరల్డ్ టీ20లో పాక్ ఆడిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పాక్ తరుపున ఐదు వన్డే మ్యాచ్లు ఆడిన లతిఫ్, 13 టీ20 మ్యాచ్లకు ప్రాతినిథ్యం వహించాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఖలీద్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేదు. షర్జీల్ మాత్రం చాలా ఛీప్గా ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలపై కామెంట్ చేసేందుకు పీఎస్ఎల్ ఛైర్మన్ నజామ్ సేథీ నిరాకరించారు. ఆటలో అవినీతి తావు లేదని చెప్పేందుకు, స్ఫాట్ ఫిక్సింగ్పై విచారణ జరిపించి ఆటగాళ్లపై వేటు వేశామన్నారు.
స్ఫాట్ ఫిక్సింగ్, అవినీతి ఆరోపణల్లో పాకిస్థాన్ ఆటగాళ్లు దొరికిపోవడం ఇదే మొదటిసారి కాదు. 2010 ఇంగ్లాండ్ పర్యటనలో స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడ్డారని పాకిస్థాన్కు చెందిన మహ్మద్ అమీర్, సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు.