హైదరాబాద్: అనిల్ కుంబ్లే రాజీనామాతో టీమిండియా ప్రధాన కోచ్ పదవికి బీసీసీఐ మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించిన నేపథ్యంలో కోచ్ పదవికి పోటీ క్రమంగా పెరుగుతోంది. తాజాగా కోచ్ రేసులోకి ఓ మాజీ ఆటగాడు వచ్చి చేరాడు. అతడి పేరు పిల్ సిమన్స్.
గతంలో వెస్టిండీస్, ఐర్లాండ్, జింబాబ్వే జట్లకు ఈ వెస్టిండిస్ ఆల్ రౌండర్ కోచ్గా పని చేశాడు. అంతేకాదు కోచ్గా సిమన్స్కు మంచి రికార్డు ఉంది. ముంబై మిర్రర్లో వచ్చిన వార్తా కథనం ప్రకారం పిల్ సిమన్స్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఐర్లాండ్ జట్టుకి ఎనిమిదేళ్లపాటు సిమన్స్ కోచ్గా సేవలందించాడు. 2011, 15 జరగిన వరల్డ్ కప్లలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, జింబాబ్వేపై ఐర్లాండ్ విజయాలు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ తర్వాత 2016లో వెస్టిండీస్ జట్టుకు కోచ్గా సేవలందించాడు.
సిమన్స్ కోచ్గా ఉన్న సమయంలోనే వెస్టిండిస్ జట్టు ఐసీసీ వరల్డ్ టీ20 విజేతగా నిలిచింది. కోచ్గా సిమన్స్కు మంచి అనుభవం ఉందని, ఆటగాళ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తాడని, మంచి జట్టుని తయారు చేస్తాడని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మిచెల్ తెలిపాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో బీసీసీఐ కోచ్ పదవి కోసం మరిన్ని దరఖాస్తులు ఆహ్వానించింది. కోచ్ పదవికి దరఖాస్తు చేసిన వారి కోసం బీసీసీఐ జులై 9 వరకు గడువుని కూడా పెంచింది.
ఇప్పటికే కోచ్ రేసులో రవిశాస్త్రి, సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డా గణేశ్, లాల్చంద్ రాజ్పుత్లు దరఖాస్తులు చేసుకున్నారు. కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులను గంగూలీ, లక్ష్మణ్, సచిన్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
ఇదిలా ఉంటే ఆదివారం కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ జులై 10న కొత్త కోచ్ను ప్రకటిస్తామని తెలిపాడు. మరోవైపు దక్షిణాఫ్రికాకి చెందిన ఓ దిగ్గజ ఆటగాడు సైతం భారత ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.