హైదరాబాద్: గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ తన మనసులోని మాటను బయటపెట్టాడు. రాబోయే రెండేళ్ల పాటు దక్షిణాఫ్రికా తరుపున అంతర్జాతీయ క్రికెట్లో ఆడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.
'దాదాపు నలభై ఏళ్ల వరకూ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనేది నా కోరిక. అదే క్రమంలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆడాలనే ఆలోచన నాలో పుట్టింది. రెండేళ్ల గురించి మాత్రమే మాట్లాడుకుందాం. నేను ఎక్కడ ఉంటానో , ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు. ఏమి జరుగుతుందో చూద్దాం. నేనైతే దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు రెండేళ్లపాటు ఆడాలనుకుంటున్నా' అని పీటర్సన్ అన్నాడు.
దక్షిణాఫ్రికాలో జన్మించిన పీటర్సన్, 2004లో ఇంగ్లాండ్కు వచ్చి క్రికెట్ కెరీర్ను ఆరంభించాడు. దాదాపు 10 ఏళ్లు పాటు ఇంగ్లండ్ తరుపున ఆడాడు. అయితే 2013-14లో జరిగిన యాషెస్ సిరీస్ అనంతరం పీటర్సన్కు ఈసీబీ ఉద్వాసన పలికింది.
ఈసీబీ నిర్ణయాన్ని స్వాగతించిన పీటర్సన్ తాను ఇక ఇంగ్లాండ్ జట్టుకు ఆడలేనంటూ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం పీటర్సన్ ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్ లాంటి టోర్నీలో సైతం పాల్గొన్నాడు. ఇంగ్లాండ్ తరుపున 104 టెస్టులాడిన పీటర్సన్ 23 సెంచరీలతో 8,881 పరుగులు నమోదు చేశాడు.