హైదరాబాద్: చిన్నతనంలోనే క్రికెట్లో రికార్డులు సృష్టించిన క్రికెటర్ ప్రణవ్ ధన్వాడే (16)పై ముంబై పోలీసులు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. అంతేకాదు అతడిపై తప్పుడు కేసు కూడా పెట్టాలని చూశారు. ముంబైలోని కల్యాణ్లో ప్రాంతంలో గల సుభాష్ మైదాన్లో ప్రణవ్కు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.
కేంద్రమంత్రి మంత్రి ప్రకాశ్ జవదేకర్ పర్యటన నేపథ్యంలో శనివారం సాయంత్రం సుభాష్ మైదాన్లో హెలికాప్టర్ దిగబోతోందన్న సమాచారం పోలీసులకు వచ్చింది. హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం కేటాయించిన మైదానం ఖాళీ చేయాలని సూచించారు. అయితే మైదానం వదిలి వెళ్లడానికి ప్రణవ్ నిరాకరించాడు.
ఈ క్రమంలో పోలీసులు ప్రణవ్తో అనుచితంగా ప్రవర్తించారు. ఓ క్రీడా మైదానాన్ని రాజకీయ నేతల పర్యటన కోసం ఎలా కేటాయిస్తారని పోలీసులను ప్రశ్నించాడు. దీంతో ఎస్సై కదమ్ ప్రణవ్పై చేయి చేసుకున్నాడు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రణవ్ తండ్రి ప్రశాంత్ పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారు.
ప్రణవ్ తండ్రి ప్రశాంత్ పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో ప్రణవ్తో పాటు తండ్రిని పోలీసులు తీసుకెళ్లి జీపు ఎక్కించి బజార్పెట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. స్టేషన్లో ఉన్న పోలీసు అధికారి దిలీప్ తమను దుర్భాలాడారని తెలిపాడు. ఏదో ఓ తప్పుడు కేసులో తమను ఇరికించాలని ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు ప్రణవ్ వాపోయాడు.
పోలీసుల తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కళ్యాణ్ ప్రాంతంలో రెండు ఉర్దూ పాఠశాలల్లో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కేంద్ర మంత్రి జవదేకర్ ఈ ఘటన గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి జవదేకర్ చివరి నిమిషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు.
ఈ మొత్తం ఘటనలో ప్రణవ్ తప్పేమీ లేదని.. పోలీసులదే తప్పని స్పష్టం చేశారు. కాగా, ప్రణవ్ ఇంటర్ స్కూల్ టోర్నీలో భాగంగా ఓ ఇన్నింగ్స్లో అజేయంగా 1009 పరుగులు చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.