మొహాలి: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం మొహాలిలో మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకం. ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచి సిరిస్లో 1-1తో ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి పైచేయి సాధించాలనే పట్టుదలతో ఇరుజట్లు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టెస్టులో 3-0 తేడాతో న్యూజిలాండ్ను వైట్ వాష్ చేసిన టీమిండియా అదే జోరుని ధర్మశాల వన్డేలో కూడా కొనసాగించింది. అయితే ఢిల్లీ వన్డేలో టీమిండియా విజయానికి న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ బ్రేక్ వేశాడు. రెండో వన్డేలో మూడు మార్పులతో దిగిన జట్టే మూడో వన్డేలో కూడా కొనసాగించే అవకాశం ఉంది.
రెండో వన్డేలో టీమిండియాకు న్యూజిలాండ్ ఊహించిన విజయంతో షాక్ ఇవ్వడంతో జట్టులో మార్పులు చేర్పులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. రెండో వన్డే విజయం మూడు టెస్టుల సిరీస్లో వైట్ వాష్ అయిన న్యూజిలాండ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఫామ్లోకి కెప్టెన్ విలియమ్సన్:
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్లోకి వచ్చాడు. తొలి వన్డేలో మూడు పరుగులు చేసి నిరాశపరిచిన విలియమ్సన్, రెండో వన్డేలో సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో వన్డేలో న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్ ప్రదర్శన కనబర్చింది. మూడో వన్డేలో కూడా అదే ప్రదర్శనను కొనసాగించే అవకాశం ఉంది.
షాక్లో టీమిండియా, రహానేకు ఛాన్స్:
ఛేజింగ్లో ఎంతటి లక్ష్యాన్ని అయినా అలవోకగా ఛేజ్ చేసే టీమిండియాకు రెండో వన్డేలో 243 పరుగుల లక్ష్యం భారంగా మారింది. టాపా అర్డర్ పూర్తిగా విఫలమైంది. టెస్టు క్రికెట్తో పాటు వన్డే క్రికెట్లో కూడా రాణిస్తున్న రహానే తన స్థానాన్ని సుస్ధిరం చేసుకునే దిశగా కనిపిస్తున్నాడు. శిఖర్ ధావన్ గాయం కారణంగా రహానే ఓపెనర్గా వస్తున్న సంగతి తెలిసిందే.
సురైనా రైనా ఆరోగ్యంపై నో అప్డేట్
ఐదు వన్డేల సిరిస్లో భాగంగా తొలి మూడు వన్డేల జట్టులో ఎంపికైన సురేశ్ రైనా... జ్వరం కారణంగా తొలివన్డేకు దూరమవ్వడంతో అతని స్థానంలో కేదార్ జాదవ్కు చోటు లభించింది. తనకు అందివచ్చిన అవకాశాన్ని కేదార్ జాదవ్ తొలి వన్డేలో చక్కగా వినియోగించుకుంటున్నాడు. రెండో వన్డేకి కూడా రైనా కోలుకోకపోవడంతో జాదవ్నే అదృష్టం వరించింది. ఇక మూడో వన్డేలో సురేశ్ రైనా ఆడతాడా లేదా? అనే విషయంపై స్పష్టత రాలేదు.
ఓపెనర్ల భాగస్వామ్యం ఎంతో కీలకం
ఇప్పటివరకు ఆడిన వన్డేల్లో భారత ఓపెనర్లు ఆశించిన మేరకు రాణించలేదు. ఒక ఎండ్లో ఓపెనర్గా అజింక్యా రహానే ఫర్వాలేదనిపిస్తున్నా, మరోవైపు రోహిత్ శర్మ పూర్తిగా వైఫల్యం చెందుతున్నాడు. మూడో వన్డేలో భారత్ గెలుపులో ముఖ్యపాత్ర పోషించేది ఓపెనర్ల భాగస్వామ్యమే. తొలి వన్డేలో కోహ్లీ రాణించడంతో విజయం సాధించిన భారత్.. రెండో వన్డేలో కోహ్లీ విఫలం కావడంతోనే పరాజయం పాలైంది.
13 ఏళ్ల తర్వాత భారత్లో వన్డే గెలుపు
13 ఏళ్ల తర్వాత భారత్లో భారత్పై వన్డే గెలిచిన ఆనందంలో న్యూజిలాండ్ జట్టు ఉంది. ఈ క్రమంలో భారత్ను ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా మరోసారి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. ఆదివారం నాటి మ్యాచ్లో న్యూజిలాండ్ పై సమిష్టిగా పోరాడితేనే ధోనిసేనపై విజయం సాధించే అవకాశం ఉంది.
మొహాలిలో భారత్కు మెరుగైన రికార్డు
మొహాలీలో భారత్ మెరుగైన రికార్డును కలిగి ఉంది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో భారత్ మొత్తం 13 వన్డేలు ఆడగా, 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఐదు వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ స్టేడియంలో భారత్ తొలిసారి 1993లో దక్షిణాఫ్రికాపై గెలవగా, చివరిసారి 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో ఓటమి పాలైంది. కాగా, 2016లో ఆస్ట్రేలియాతో చివరిసారి ఆడిన వరల్డ్ టీ20లో భారత్ విజయం సాధించింది.