హైదరాబాద్: ఇప్పటికే రెండు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిళ్లను దక్కించుకున్న ముంబై ఇండియన్స్.. రైజింగ్ పుణె సూపర్జెయింట్స్(ఆర్పీఎస్) నుంచి ఐపీఎల్-10 ఫైనల్లో గట్టి పోటీనే ఎదుర్కోనుంది. ఐపీఎల్ 10ఫైనల్ మ్యాచ్ ఆదివారం(మే21) హైదరాబాద్లో జరగనుంది. ఈ రెండు జట్లు వేరైనా ఈ రెండూ కూడా మహారాష్ట్రకే చెందినవే కావడం విశేషం.
క్వాలీఫైయర్ 1తోపాటు ఈ లీగ్లో ముంబై ఇండియన్స్ జట్టును రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టు మూడు సార్లు ఓడించింది. అయితే, నాలుగోసారి ఫైనల్లో తలపడుతున్న ముంబై.. విజయాన్ని కూడా నమోదు చేసే అవకాశాలు లేకపోలేదు. రెండుసార్లు టైటిల్ గెలిచిన ముంబై జట్టు నాలుగోసారి ఫైనల్ చేరుకోవడం గమనార్హం.
కాగా, ఈ లీగ్ లో రైజింగ్ పుణె సూపర్జెయింట్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రం ఇది ఏడో ఫైనల్ మ్యాచ్ కావడం విశేషం. ఇక ముంబై జట్టు బలాల గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ రోహిత్ శర్మ, కీరన్ పొలార్డ్, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ఉన్నారు. 2013, 2015 విజయాల్లో వీరే కీలక పాత్ర పోషించారు.
జోస్ బట్లర్ జట్టుకు దూరమైన లెండి సిమన్స్ జట్టుతో చేరడంతో ముంబైకి మరో మంచి ఆటగాడు దొరికినట్లయింది. 19వికెట్లు తీసిన మిచెల్ మెక్ లీన్, మిచెల్ జాన్స్లు బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లోనూ రాణిస్తున్నారు. నితీష్ రాణా(333), గాయం నుంచి కోలుకున్న అంబటి రాయుడు కూడా జట్టుకు అదనపు బలమే. హర్భజన్, మలింగ, బుమ్రాలు కూడా బౌలింగ్ విభాగంలో బాగానే రాణిస్తున్నారు.
పాండే బ్రదర్స్.. క్రునల్, హార్ధిక్ పాండేలు కూడా జట్టుకు వారి సామర్థ్యం మేర అండగా నిలుస్తున్నారు. రోహిత్ శర్మ అయితే తనకు అనుకూలంగా ఉంటే ఒంటి చేత్తో మ్యాచ్ను మలుపుతిప్పేగలడు.
ఇక ఆర్పీఎస్ జట్టు గురించి చెబితే.. ప్రధాన బలం మహేంద్ర సింగ్ ధోనీ. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతూనే ఉన్నాడు. 2008, 2015 మధ్య కాలంలో ఆరుసార్లు ఫైనల్ మ్యాచులు ఆడాడు. అంతేగాక, 2010, 11 ఎడిషన్లలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా టైటిళ్లు అందుకున్నాడు. ఈ సీజన్లో పుణెకు ధోనీ కెప్టెన్ కాకపోయిన కెప్టెన్ గా ఉన్న స్మిత్.. ధోనీ సేవలను ఉపయోగించుకుంటూనే ఉన్నాడు. ఫైనల్లో కూడా ధోనీ తన మార్కును చూపే అవకాశం ఉంది.
అంతేగాక, మ్యాచ్ ఫలితాన్ని మార్చే శక్తి ధోనీకి ఉండటం ఆ జట్టుకు కలిసివచ్చే అంశమే. పుణె జట్టులో ఇతర ఆటగాళ్లు కూడా బాగానే రాణిస్తున్నారు. రెండూ బలమైన జట్లే కావడంతో హైదరాబాద్లో జరిగే ఫైనల్ మ్యాచ్ హోరాహోరీగానే జరిగే అవకాశం ఉంది. అయితే, మొత్తంగా చూసుకుంటే.. పుణె కంటే ముంబై ఇండియన్స్ జట్టే బలంగా కనిపిస్తోంది. టైటిల్ చేజిక్కించుకోవాలంటే రోహిత్ శర్మ.. ఇద్దరు కెప్టెన్ల(పుణె కెప్టెన్ స్మిత్, మాజీ కెప్టెన్ ధోనీ)ను ఎదుర్కోవాల్సి ఉంటుందనే చెప్పాలి.
జట్లు
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(కెప్టెన్), లెండి సిమన్స్, పార్థీవ్ పటేల్(వికట్ కీపర్), కీరన్ పొలార్డ్, అంబటి రాయుడు, క్రునల్ పాండ్యా, హార్ధిక్ పాండ్యా, కరణ్ శర్మ, మిచెల్ మెక్ లీన్, లసిత్ మలింగ, మిచెల్ జాన్సన్, నితీష్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, సౌరబ్ తివారీ, రంగనాథ్ వినయ్ కుమార్, టిమ్ సౌతీ, జితేష్ శర్మ, కృష్ణప్ప గౌతమ్, శ్రేయాష్ గోపాల్, కుల్వంత్ ఖేజ్రోలియా
రైజింగ్ పుణె సూపర్జెయింట్స్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, అజింక్యా రహానే, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), మనోజ్ తివారీ, రజత్ భాటియా, లోకీ ఫెర్గూసన్, డాన్ క్రిస్టియన్, షర్దుల్ ఠాకూర్, జయదేవ్ ఉనాద్కత్, దీపక్ చహర్, రాహుల్ ఛహర్, ఆడమ్ జంపా, అంకూష్ బేయిన్స్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, అశోక్ దిండా, మయాంక్ అగర్వాల్, జస్కరన్ సింగ్, ఈశ్వర్ పాండే, మిలింద్ టాండన్.
సోనీ సిక్స్, సోనీ మ్యాక్స్, సోనీ ఈఎస్పీఎన్ ఛానళ్లలో ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8గంటలకు ప్రత్యక్ష ప్రసారమవుతుంది.