44 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన జడేజా
రెండో ఇన్నింగ్స్లో మొత్తం 44 ఓవర్ల పాటు బౌలింగ్ వేసిన జడేజా 54 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. మరోవైపు మిడిల్ సెషన్లో పిచ్ నుంచి బౌలర్లకు సహకారం లభించనందు వల్లే మూడో టెస్టులో విజయం సాధించలేకపోయామని కోహ్లీ అన్నాడు.
భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన షాన్మార్ష్, పీటర్స్ హ్యాండ్స్కోంబ్
భోజన విరామం కన్నా ముందు వికెట్లను తీయలేకపోయామని, ఆసీస్ బ్యాట్స్మెన్ షాన్మార్ష్, పీటర్స్ హ్యాండ్స్కోంబ్లు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించారని అన్నాడు. నాలుగోరోజూ చివర్లో బంతి బాగానే తిరిగిందని అయితే శనివారం ఉదయం కూడా స్పిన్ చక్కగా తిరిగిందని కోహ్లీ చెప్పాడు.
మిడిల్ సెషన్ వల్లే మ్యాచ్ మలుపు తిరిగింది
కొత్త బంతి తీసుకున్న తర్వాత రెండు వికెట్లు తీయగలిగామని, అయితే సమస్య అంతా మిడిల్ సెషన్లోనే వచ్చిందని కోహ్లీ పేర్కొన్నాడు. నిజానికి తొలి ఇన్నింగ్స్లో వికెట్ తీయడం చాలా కష్టం. పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా డ్రా కోసం ప్రయత్నించి విజయం సాధించిందని కోహ్లీ అన్నాడు.
600 వరకూ స్కోరు చేయడం చాలా కష్టం
తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 451 పరుగులు చేసింది. నాలుగోరోజు ఆట ప్రారంభమయ్యేసరికి మేం 328/6 పరుగులతో ఉన్నాం. అక్కడి నుంచి 600 వరకూ స్కోరు చేయడం చాలా కష్టం. అయితే, జట్టు విజయం సాధించే దిశగా నడిపించామని కోహ్లీ అన్నాడు. కాగా రాంచీ టెస్టు డ్రాగా ముగియడంతో టెస్టు సిరిస్ 1-1తో సమమైంది.