హైదరాబాద్: ఆఫ్ స్పిన్నర్, ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ టీమిండియాకు లభించిన ఆణిముత్యమని క్రికెట్లో ఉన్న అత్యుత్తమ కోచ్లలో ఒకడిగా ఉన్న డేవ్ వాట్మోర్ ప్రశంసలు కురిపించాడు. వచ్చే నెలలో భారత పర్యటనకు రానున్న ఆస్ట్రేలియా జట్టుని ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
టాస్ కీలకం: బారాబతిలో మంచి రికార్డు, సిరిస్ గెలుస్తుందా?
ఆస్ట్రేలియా జట్టుకు అత్యుత్తమ టీ20 జట్టు ఉన్నప్పటికీ, ఉపఖండంలో మాత్రం భారత్పై విజయం సాధించడం కష్టమేనని చెప్పాడు. ప్రస్తుతం టీమిండియాకు అద్భుతమైన టెస్టు టీమ్ ఉందని అన్నాడు. అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్తో పాటు పరస్పరం వెన్నుతట్టి ప్రోత్సహించుకొనే ఆటగాళ్లతో టీమిండియా అద్భుతంగా ఉందన్నాడు.
ఈ నేపథ్యంలో భారత పర్యటనకు వెళుతున్న ఆస్ట్రేలియా అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించాడు. 'ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో అశ్విన్ ఒకడు. బంతితోనే కాకుండా బ్యాటింగ్లో ఆరో స్థానంలో వచ్చి సెంచరీలు చేయగలడు. తమిళనాడు నుంచి వచ్చిన ఈ ఇంజనీర్ స్మార్ట్ బాయ్' అని డేవ్ వాట్మోర్ కొనియాడాడు.
ఛేజింగ్లో కోహ్లీ సూపర్బ్, అతడి దగ్గర పాఠాలు నేర్చుకుంటా: రూట్
'అతడు జట్టులో కచ్చితంగా ఉండాల్సిన వ్యక్తి. తన జట్టులో అశ్విన్ ఉన్నందుకు కోహ్లీ కచ్చితంగా ఆనందిస్తాడు. ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ స్థాయి బౌలరైనా అశ్విన్లా బ్యాటింగ్ మాత్రం చేయలేడు' అని అన్నాడు. పాకిస్థాన్, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి జట్లకు వాట్ మోర్ కోచ్గా వ్యవహరించాడు.
భారత పర్యటనకు వెళుతున్న ఆస్ట్రేలియా 16 మంది జట్టులో నలుగురు స్ఫిన్నర్లను ఎంపిక చేయడంపై కూడా స్పందించాడు. ఉపఖండం పిచ్ల్లో రాణించే విధంగా పేస్ బౌలర్లకు బదులు నలుగురు స్ఫిన్నర్లను ఎంపిక చేయడం అనేది జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తుందని తాను భావించడం లేదన్నాడు.
ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టులో మెక్గ్రాత్, షేన్వార్న్ లాంటి బౌలర్లు లేరన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సొంత దేశంలో స్పిన్ను బాగా ఎదుర్కొన్నా ఉపఖండంలో మాత్రం తికమక పడతారని వాట్ మోర్ స్పష్టం చేశాడు. ఈ మధ్య కాలంలో భారత్లో ఫాస్ట్ బౌలింగ్ ఎంతో అభివృద్ధి చెందిందన్నాడు. 62 ఏళ్ల డేవ్ వాట్ మోర్ 1996లో వరల్డ్ కప్ సాధించిన సమయంలో శ్రీలంక జట్టు కోచ్గా ఉన్నారు.