ముంబై: జగ్మోహాన్ దాల్మియా మరణంతో ఖాళీ ఆయిన బీసీసీఐ అధ్యక్ష పదవికి రేసు మొదలైంది. బోర్డు మాజీ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్. శ్రీనివాసన్ అధ్యక్ష పదవి కోసం తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన వర్గం నేతలతో బుధవారం ఉదయం భేటీ అయ్యారు.
అనంతరం వెంటనే ముంబై క్రికెట్ అసోసియేషన్ చీఫ్ శరద్ పవార్ను కలిసేందుకు ప్రత్యేక విమానంలో నాగ్పూర్కు బయల్దేరి వెళ్లారు. గతంలో బోర్డు అధ్యక్షుడిగా పనిచేసిన కేంద్ర మాజీ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయి అధ్యక్ష పదవిపై సుమారు రెండు గంటల పాటు మంతనాలు జరిపారు.
బీసీసీఐ అధ్యక్ష పదవి ఎంపికపైనే శ్రీనివాసన్, శరద్ పవార్తో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్కు చెందిన శ్రీనివాసన్ గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆ పదవికి జగ్మోహాన్ దాల్మియా ఎంపికయ్యారు.
బోర్డులో మెజారిటీ సభ్యుల వాటా ఉన్న శ్రీనివాసన్కు పవార్ మద్దతు లభిస్తే, అధ్యక్ష పదవిని చేజిక్కించుకోవడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు క్రీడా వర్గాలు. అంతేకాదు శ్రీనికి పవార్ మద్దతు లభిస్తే, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్కు చెక్ పెట్టొచ్చనే భావనతోనే పావులు కదుపుతున్నారు.
బీసీసీఐ నిబంధనల ప్రకారం అధ్యక్షుడు మధ్యలోనే పదవికి దూరమైతే కొత్త అధ్యక్షుడి ఎన్నిక కోసం బోర్డు కార్యదర్శి 15 రోజుల్లోగా బోర్డును సమావేశపరిచి, కొత్త అధ్యక్షుడి ఎన్నికకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.
సుదీర్ఘ అనుభవం ఉన్న దాల్మియా మరణం తర్వాత బోర్డు పగ్గాల చేపట్టేదెవరు?ఇదే ప్రశ్న ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం బోర్డు ఉపాధ్యక్షుడిగా, ఐపీఎల్ ఛైర్మన్గా ఉన్న రాజీవ్ శుక్లా ఈ పదవికి రేసులో అందరికన్నా ముందు వరుసలో రాజీవ్ శుక్లా ఉన్నారు. ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఈ కాంగ్రెస్ నేతకు ఈశాన్య రాష్ట్రాల బోర్డుల మద్దతు లభించాల్సి ఉంది.