హైదరాబాద్: ధర్మశాల టెస్టులో కోహ్లీ ఆడనట్లయితే వైస్ కెప్టెన్ రహానే భారత జట్టుని అద్భుతంగా నడిపించగలడని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. ధర్మశాల టెస్టుకు ముందు స్టీవ్ స్మిత్ విలేకరులతో మాట్లాడాడు.
ధర్మశాల టెస్టు: కోహ్లీ దూరం, 33వ టెస్టు కెప్టెన్గా రహానే
ఈ సందర్భంగా వైస్ కెప్టెన్ రహానే 'మృదు స్వభావి' అని కితాబిచ్చాడు. ధర్మశాల టెస్టులో కోహ్లీ నాయకత్వం లేకుంటే టీమిండియాపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు స్మిత్ జవాబిచ్చాడు.
'లేదు, అంతా సక్రమంగా ఉంటుంది. వాళ్లు బాగా ఆడతారు. రహానే అద్భుతంగా జట్టును నడిపించగలడు. భుజం నొప్పి గాయంతో రాంచీ టెస్టులో కోహ్లీ మైదానాన్ని వీడినప్పుడు అతడు జట్టును ధైర్యంగా ముందుకు నడిపించాడు. రహానేపై నమ్మకముంది' అని స్మిత్ చెప్పాడు.
వైస్ కెప్టెన్ రహానే మృదు స్వభావి అని... మైదానంలో, బయటా అంత సులభంగా భావోద్వేగానికి గురికాడని పేర్కొన్నాడు. మ్యాచ్ పరిస్థితిని చక్కగా అంచనా వేయగలడని స్మిత్ చెప్పడం విశేషం. చివరి టెస్టుకు విరాట్ కోహ్లీ దూరమైనప్పటికీ, రహానే జట్టుని సమర్ధవంతగా నడిపించగలడని చెప్పాడు.
ఇక శుక్రవారం జట్టులోకి చేరిన శ్రేయాస్ అయ్యర్పైనా స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రాక్టీస్ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన శ్రేయాస్ దూకుడుగా ఆడాడని చెప్పాడు. తమ ప్రధాన బౌలర్లను ఎదుర్కోకున్నా గొప్పగా ఆడగలడని అనిపిస్తోందని స్మిత్ పేర్కొన్నాడు.
చివరి టెస్టులో మ్యాచ్ ఫలితం ఎలా ఉన్న తమకు ఇబ్బంది లేదని స్మిత్ పేర్కొన్నాడు. స్వదేశంలో టీమిండియాను ఎదుర్కోవడం ఎప్పటికీ కష్టమే అని పేర్కొన్నాడు.