హైదరాబాద్: భారత్, ఇంగ్లాండ్ అండర్ 19 జట్ల మధ్య బుధవారం జరిగిన చివరి వన్డే టైగా ముగిసింది. దీంతో ఇప్పటికే ఐదు వన్డేల సిరిస్లో 3-1 ఆధిక్యంలో ఉన్న టీమిండియా సిరీస్ను దక్కించుకుంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 227 పరుగుల లక్ష్యఛేదనలో ఆఖరి బంతికి గెలిచే అవకాశాన్ని టీమిండియా చేజేతులా వదులుకుంది.
లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్యాటర్సన్ వైట్ (1/40) చివరి బంతికి వికెట్ తీయడంతో నిర్ణీత ఓవర్లలో 226 పరుగులకు ఆలౌటైంది. భారత్ విజయానికి చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో ఇషాన్ పొరెల్ 6 పరుగుల వద్ద ఇంగ్లాండ్ బౌలర్ వైట్ వేసిన ఫుల్టాస్ బంతిని కవర్స్ దిశలో షాట్కు ప్రయత్నించి హోల్డెన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు.
భారత ఓపెనర్లు మన్జ్యోత్ కల్రా (21), ప్రియం గార్గ్ (0)లతో పాటు అభిషేక్ శర్మ (4), మయాంక్ రావత్ (1) విఫలమవడంతో భారత్ 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన రాధాకృష్ణన్ అర్ధసెంచరీతో పాటు లోయరార్డర్లో ఆయూష్ (40), యాష్ ఠాకూర్ (30) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
దీంతో భారత జట్టు లక్ష్యానికి చేరువగా వచ్చింది. చివరి బంతికి భారత్ విజయం కోసం ఒక పరుగు చేయాల్సి ఉంది. వైట్ బౌలింగ్లో పరుగు కోసం ప్రయత్నించిన పేసర్ ఇషాన్ పొరెల్(6) హోల్డెన్కు క్యాచ్ చివరి వికెట్కు వెనుదిరగడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రూక్ 3, బ్లాతర్విక్, గాడ్సల్, రావ్లీన్స్కు రెండేసి వికెట్లు దక్కాయి.
తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ జట్టులో బార్ట్లెట్ (47), ఒలీ పోప్ (45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో జమ్వాల్ 3, పోరెల్ 2 వికెట్లు తీసుకున్నారు.
సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లాండ్ అండర్-19: 50 ఓవర్లలో 226/9(బార్ట్లెట్ 47, జమ్వాల్ 3/40), భారత్ అండర్-19: 50 ఓవర్లలో 226 ఆలౌట్(రాధాకృష్ణన్ 65, బ్రూక్స్ 3/30)