హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, అండర్-19 కోచ్ రాహుల్ ద్రవిడ్ బుధవారం (జనవరి 11)నాడు 44వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్లతో పాటు ప్రస్తుత క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్కు శుభాకాంక్షలు తెలిపారు. మిస్టర్ డిపెండబుల్గా పేరుగాంచిన రాహుల్ ద్రవిడ్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు.
భారత క్రికెట్ జట్టు అపజయాలకు అడ్డుగోడగా నిలిచాడు. భారత క్రికెట్ దిగ్గజాలు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరభ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్తో కలిసిన చతుష్టయంలో ఒకడిగా నిలిచాడు. తన కెరీర్లో 164 టెస్టు మ్యాచ్లాడిన ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. ప్రస్తుతం యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత భారత్ 'ఎ', అండర్ 19 కోచ్గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాడు. 344 వన్డేలాడిన ద్రవిడ్ 10,899 పరుగులు సాధించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తర్వాత భారత్ జట్టులో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడు రాహుల్ ద్రవిడ్. వన్డేలు, టెస్టులు రెండింట్లో రాహుల్ ద్రవిడ్ మొత్తంగా 24,208 పరుగులు చేశాడు.
ఇక టీమిండియా తరుపున దక్షిణాఫ్రికాలో ఒకే ఒక్క టీ20 మ్యాచ్ ఆడిన రాహుల్ ద్రవిడ్ 31 పరుగులు చేశాడు. టెస్టు హోదా కలిగిన అన్ని దేశాలపై సెంచరీలు నమోదు చేసిన ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. 2004లో బంగ్లాదేశ్పై టెస్టు సెంచరీ చేయడం ద్వారా రాహుల్ ద్రవిడ్ ఈ ఘనతను సాధించాడు.
తన 16 ఏళ్ల కెరీర్లో రాహుల్ ద్రవిడ్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. బ్యాట్స్మెన్గానే కాకుండా కెప్టెన్గా కూడా జట్టులో తనదైన ముద్ర వేశాడు. వైస్ కెప్టెన్గా ఉన్న సమయంలో కుర్రాళ్లు క్రమశిక్షణ తప్పకుండా, పరిమితులు దాటకుండా ద్రవిడ్ కన్నేర్ర చేశాడు.
జులై 13, 2002న నాట్వెస్ట్ ఫైనల్లో భారత్ విజయ దుందుభి మోగించింది. ఈ సందర్భంగా అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ లార్డ్స్ బాల్కనీలో చొక్కా విప్పి, గిరగిరా తిప్పి సంచలనం సృష్టించాడు. ఆ మ్యాచ్లో మహ్మద్ కైఫ్ (87 నాటౌట్)తో పాటు యువరాజ్ సింగ్ (69) అర్ధ సెంచరీ సాధించి విజయంలో కీలకపాత్ర పోషించారు.
సౌరభ్ గంగూలీ చొక్కా విప్పగానే యువరాజ్ సైతం తన చొక్కా విప్పేందుకు సిద్ధమయ్యాడట. అయితే యువీ అలా చేయకుండా ద్రవిడే ఆపాడని గతంలో వార్తలు వచ్చాయి. గంగూలీ కెప్టెన్గా ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో వ్యూహాలు అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం వైస్ కెప్టెన్గా ద్రవిడ్పై ఉండేదట.