హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా చెన్నైలో జరిగిన చివరి టెస్టులో పరుగుల సునామీ సృష్టించిన కర్ణాటక బ్యాట్స్మెన్లు కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్లు రంజీ ట్రోఫీలో విఫలమయ్యారు. తమిళనాడుతో రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో భాగంగా విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్లో కరుణ్ నాయర్ 14, కేఎల్ రాహుల్ 4 పరుగులకే వెనుదిరిగారు.
దీంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 37.1 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక జట్టులో మనీశ్ పాండే చేసిన 28 పరుగులే అత్యధిక స్కోరు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కర్ణాటక జట్టు తమిళనాడు బౌలర్లు అశ్విన్ క్రిస్ట్ (6/31), నటరాజన్ (3/18) విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 88 పరుగులకే ఆలౌటైంది.
కర్ణాటక ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత తమిళనాడు బౌలర్ అశ్విన్ చెలరేగిపోవడంతో కర్ణాటక బ్యాట్స్మెన్లో ఎవరూ నిలబడలేకపోయారు. దీంతో వేగంగా వికెట్లను కోల్పోయి వందలోపే కర్ణాటక ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన తమిళనాడు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్లో 36 ఓవర్లలో 4 వికెట్లకు 111 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (34), దినేశ్ కార్తీక్ (31 బ్యాటింగ్) నాలుగో వికెట్కు 70 పరుగులు జోడించారు. దినేశ్ కార్తీక్(31), అభినవ్ ముకుంద్(3) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం తమిళనాడు 23 పరుగుల ఆధిక్యంలో ఉంది.
స్కోరు వివరాలు: తొలిరోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 88 ఆలౌట్ (మనీశ్ పాండే 28; అశ్విన్ క్రిస్ట్ 6-31, టి. నటరాజన్ 3-18) vs తమిళనాడు 111/4 (విజయ్ శంకర్ 34, దినేశ్ కార్తీక్ 31 నాటౌట్; శ్రీనాథ్ అరవింద్ 2-14).