బెంగుళూరు: భారత జట్టు హెడ్ కోచ్గా ఎంపికైన భారత జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే బుధవారం (జూన్ 29)న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనిల్ కుంబ్లే... రవిశాస్త్రిపై ప్రశంసలు కురిపించాడు. టీమిండియా డైరెక్టర్గా ఉన్న సమయంలో రవిశాస్త్రి అద్భుతంగా పనిచేశారంటూ కొనియాడారు.
టీమిండియా డైరెక్టర్గా వ్యవహరించిన రవిశాస్త్రీనే టీమిండియా కోచ్ బాధ్యతలు చేపడతారని అంతా అనుకున్నప్పటికీ.. అనూహ్యంగా మాజీ స్పిన్ దిగ్గజం అనిల్ కూంబ్లే తెరపైకి వచ్చి కోచ్ పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ పదవికి వీరిద్దరి మధ్యే గట్టి పోటీ నెలకొన్నా చివరకు అనిల్ కుంబ్లేనే బీసీసీఐ కోచ్గా ఎంపిక చేసింది.
కాగా, అనిల్ కుంబ్లే హోం గ్రౌండ్ బెంగుళూరులోని చిన్నసామి స్టేడియంలో అనిల్ కుంబ్లే కోచ్గా కొత్త ఇన్నింగ్స్ను ప్రారంభించాడు. కోచ్గా మీడియాకు ఇచ్చిన తొలి ఇంటర్యూలో అనిల్ కుంబ్లే టీమిండియా డైరెక్టర్గా రవిశాస్త్రి అందించిన సేవలతో పాటు కోచ్గా తన విధులపై మాట్లాడారు.
హెడ్ కోచ్గా తనను ఎంపిక చేశారని తెలిసిన తర్వాత మొట్టమొదటి రవిశాస్త్రికి ఫోన్ చేశానని అన్నారు. టీమ్ డైరెక్టర్, కోచ్గా తన 18 నెలల కాలంలో అద్భుతంగా పనిచేశారంటూ మెచ్చుకున్నానని తెలిపారు. ఇది కేవలం కోచ్గా కాదని, ప్లేయర్స్ కోసమేనని చెప్పుకొచ్చారు.
దీనికి ప్రతిగా రవిశాస్త్రి తనతో అద్భుతమైన జట్టుకు కోచ్గా ఎంపికయ్యావని తనకు అభినందనలు తెలిపారని అన్నారు. రేపు మరోకరు ఈ పదవిలో ఎంపిక కావచ్చు, ఈ పదవి నానొక్కడికే సొంతం కాదన్నారు. ఈ జర్నీలో నేను భాగస్వామ్యం అయ్యానని చెప్పారు. అయితే ఈ జర్నీలో భాగస్వామిని అయినందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.
ఇది రవి లేదా నా గురించి మాత్రం కాదని చెప్పిన కుంబ్లే టీమిండియా బాగా రాణించాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.బౌలింగ్ కోచ్ను ప్రత్యేకంగా నియమించాలని అనుకున్నా.. ప్రస్తుతానికి తానే ఆ పని కూడా చూసుకుంటానని చెప్పారు.
వెస్టిండీస్ పర్యటనలో ఇషాంత్ శర్మ బౌలింగ్ బృందానికి నేతృత్వం వహిస్తాడని తెలిపారు. మళ్లీ చాలా రోజుల తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లోకి రావడం ప్రత్యేకంగా ఉందని కుంబ్లే అన్నారు
తాను ఇప్పటికే ధోనీ, కోహ్లిలతో మాట్లాడానని, టీమ్ మెరుగైన భవిష్యత్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని కుంబ్లే అన్నారు. కోచ్ టీమ్ను వెనక ఉండి నడిపిస్తాడని, ఫీల్డ్లో నిర్ణయాలు తీసుకోవాల్సింది కెప్టెనే అని అన్నారు.
ఓడినా, గెలిచినా ఫైటింగ్ స్పిరిట్ మాత్రం అలాగే ఉండాలని కుంబ్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టీమిండియా హెడ్ కోచ్గా అనిల్ కుంబ్లే ఏడాది పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. కోచ్గా అనిల్ కుంబ్లే ఏడాది కాలంలో టీమిండియా 17 టెస్టులు ఆడనుంది.
ఇందులో 13 భారత్లో ఆడనుండటం కుంబ్లేకు కలిసొచ్చే అంశం. ఎందుకంటే టీమిండియాను టెస్టుల్లో భారత్లో ఓడించడం చాలా కష్టం కాబట్టి. మరోవైపు టీమిండియా కుంబ్లే సారధ్యంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో వ్డనే సిరిస్లను ఆడనుంది.
కరేబియన్ పర్యటనలో నిమిత్తం బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శిక్షణ పొందుతున్న భారత జట్టుతో ఆయన జత కలిశారు. వచ్చే నెలలో వెస్టిండిస్తో జరగనున్న నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం భారత్ కరేబియన్ పర్యటనకు వెళ్లనుంది.
ఇదిలా ఉంటే టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రవిశాస్త్రిని ఆ పదవికి ఎంపిక చేయడంతో ఒకింత అసంతృప్తికి గురైన సంగతి తెలిసిందే. కోచ్ పదవికి మరో ప్రధాన పోటీదారు అయిన రవిశాస్త్రికి ఇంటర్వ్యూ జరిగే సమయంలో అసలక్కడ గంగూలీనే లేడట. ఈ విషయాన్ని స్వయంగా రవిశాస్త్రినే వెల్లడించాడు.
కాగా, కోచ్ పదవిని ఆశించిన రవిశాస్త్రి.. తనకు ఆ అవకాశం దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. టీమిండియా డైరెక్టర్గా 18 నెలలు కష్టపడ్డానని, యువ జట్టుతో అనేక విజయాలు సాధించి పెట్టానని.. అయినా తనకు కోచ్ పదవి దక్కలేదని వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రవిశాస్త్రిపై ప్రశంసలు కురిపించడం కాస్తంత ఊరట కలిగించే అంశమే.