భారత్దే ఆధిపత్యం
శ్రీలంకతో టెస్టు సిరీస్లో కోహ్లీసేన అద్భుత ప్రదర్శన చేసింది. సొంతగడ్డపై చివరగా లంక ఇంత ఘోరంగా ఎప్పుడు ఓడిపోయిందో చెప్పండి. అయితే, ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వాళ్ల గురించి కాదు. మన జట్టు గురించి. టీమిండియా ఇక్కడ ఎలాంటి ఆధిపత్యాన్ని చూపిందో చెప్పుకోవాలి. ఈ సిరీస్లో భారత్ అత్యల్ప స్కోరు (487). ప్రత్యర్థి అత్యధిక స్కోరు కంటే వంద పైచిలుకు ఎక్కువే. ముఖ్యంగా ధావన్ టైమింగ్ను చూసి ఎంతో ఆనందపడ్డా. పుజారా అద్భుత ఫామ్లో ఉన్నాడు. మొత్తంగా ఐదుగురు ఆటగాళ్లు సెంచరీలు చేయడం.. పదిమంది 50 ప్లస్ స్కోర్లు చేయడం గొప్ప విషయం.
గెలుపు, ఓటములు ఆటలో భాగం:
ఏ ఆటలోనైనా గెలుపు, ఓటములనేవి భాగం. ఆఖరు వరకు విజయం కోసం శ్రమించి ఓడినా కూడా అంత బాధ అనిపించదు. అది అసలు సమస్య కాదు. ఓటమివైపు నిలిచినా.. పోరాడారన్న భావన తలెత్తుకునేలా చేస్తుంది. ఇలాంటి క్రమశిక్షణనే మనకు లంకతో టెస్ట్ సిరీస్లో స్పష్టంగా కనిపించింది. సిరీస్ మొత్తమ్మీద రెండు నో బాల్స్ మాత్రమే నమోదు కాగా, కేవలం రెండు క్యాచ్లు మాత్రమే మిస్ చేశారు. దీన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలనుకుంటున్నా.
బౌలింగ్ బెంచ్ సూపర్బ్
ప్రస్తుత భారత జట్టు బౌలింగ్ బెంచ్ పటిష్టంగా ఉంది. మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ ఎలాంటి పిచ్లపైనైనా నిలకడగా గంటకు 140-145 కి.మీల వేగంతో బౌలింగ్ చేస్తున్నారు. తమదైన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మరోవైపు సుధీర్ఘ ఫార్మాట్లో టాప్ బౌలర్లుగా కొనసాగుతున్న అశ్విన్, జడేజా తమ సూపర్ ఫామ్తో అదరగొడుతున్నారు. ఇక కుల్దీప్యాదవ్, బుమ్రా, అక్షర్పటేల్ లాంటి వాళ్లు కూడా రాణిస్తున్నారు. కుల్దీప్ ఇప్పుడిప్పుడే జాతీయజట్టులో నిలదొక్కుకుంటున్నాడు. కుల్దీప్ను టెస్ట్లే గాకుండా వన్డేల్లోనూ అవకాశమిస్తున్నాం.
ఫీల్డింగ్పై దృష్టి
ఫీల్డింగ్ విభాగంపై మరింత దృష్టి పెడుతున్నాం. ఎందుకంటే 2019 వరల్డ్కప్ను జట్టును ప్రకటించాల్సి వచ్చినప్పుడు మనం ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డింగ్ బలంతో ముందుకెళ్లాలి. అందుకే, అత్యంత ఫిట్గా ఉన్న ఆటగాళ్లే మనుగడ సాధించగలుగు తారు. జట్టుతో కలిసి ముందుకెళ్తారు. వరల్డ్కప్ జట్టు ప్రాధాన్యతల్లోనూ అదే కీలకం.
హార్దిక్ సూపర్
హార్దిక్పాండ్యా జట్టుకు అదనపు బలంగా మారాడు. అతడు దేన్నయి నా వేగంగా నేర్చుకుంటాడు. ఏ మాత్రం తడబాటు లేకుండా దూకుడుగా ఆడుతున్నాడు. ఉదయం ఆట మొదలవక ముందు అరుణ్తో కలిసి కట్టర్లను ప్రయోగించడం నేర్చుకొని.. అదేరోజు ఆటలో వాటిని అమలు చేసేవాడు. కోహ్లీ చెప్పినట్టు ఈ సిరీస్లో గొప్ప సానుకూలాంశం అతడే. లంకతో సిరీస్ ద్వారా హార్దిక్ రూపంలో అసలైన ఆల్రౌండర్ దొరికాడని. మూడో టెస్టులో అతని సెంచరీ గంటలో మ్యాచ్ దిశను మార్చేసింది. ఇద్దరు పేసర్లు ఉన్నప్పుడు పాండ్యాతో జట్టులో కచ్చితంగా సమతుల్యం లభిస్తుంది.
జట్టుకు కెప్టెనే లీడర్
కోహ్లీ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టక ముందు ఇది ధోనీసేన. ప్రస్తుతం జట్టులో ఉన్న కొంతమంది ప్రతిభావంతులను ధోనీ తీర్చిదిద్దాడు. ఎప్పుడైనా జట్టుకు కెప్టెనే లీడర్. ఆ పాత్రకు కొనసాగింపు కోచ్. జట్టుకు సంబంధించి అన్నీ సక్రమంగా ఉండేలా చూసే బాధ్యత కోచ్ది. మైదానంలో ఉత్తమ ప్రదర్శన చేయడం కెప్టెన్ విధి. గతంలో డైకెర్టెర్గా ఉన్నప్పుడూ నేను ఈ సూత్రాలనే పాటించా. నాతో పాటు ఎవరేం చేసినా అంతిమంగా కెప్టెన్ తన జట్టుతో ఏం చేశాడన్నదే ముఖ్యం. జట్టులో ఒకరిపై మరొకరికి విశ్వాసం కీలకం. అది ఉండేలా చూసుకోవడం నా బాధ్యత.
2019 వరల్డ్ కప్ ప్రాధాన్యాలు ఏంటో తెలుసు
వరల్డ్కప్నకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వచ్చే ఏడాది వరుస టెస్ట్ సిరీస్లతో పాటు 2019లో ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఉంది. దాన్ని గౌరవించాల్సిందే. నాలుగేళ్లకోకసారి జరిగే వరల్డ్ కప్ ఉన్న ప్రాధాన్యమేంటో తెలుసు. అభిమానుల అంచనాలకు అనుగుణంగా రాణించాల్సి ఉంటుంది. వరల్డ్ కప్, టెస్టు క్రికెట్ రెండూ వేర్వేరు లక్ష్యాలు. మరోవైపు టెస్ట్ క్రికెట్ దీనికి పూర్తి భిన్నమైంది. రెండింటికీ ప్రత్యేక స్థాయిలో సన్నద్ధం కావాలి. సుదీర్ఘ ఫార్మాట్ ద్వారా జట్టు సత్తా ఏంటో తెలిసివస్తుంది. ప్రస్తుత జట్టుకు నిజమైన పరీక్ష మాత్రం టెస్టు క్రికెట్టే. వచ్చే ఏడాది ఎక్కువ టెస్టులు ఆడబోతున్నాం. మరోవైపు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఆటను ఎలా అవగతం చేసుకుంటున్నాయో చూడండి. అత్యుత్తమ స్థాయిలో టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాయి.