హైదరాబాద్: టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అనారోగ్య కారణాల వల్ల అశ్విన్ తాత ఎస్.నారాయణసామి(92) శనివారం తుది శ్వాస విడిచారు. ఈ మేరకు అశ్విన్ కుటుంబ సభ్యులు ఆదివారం మీడియాకు వెల్లడించారు.
ఆదివారం నారాయణసామి పార్థీవదేహానికి కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణసామి సదరన్ రైల్వేస్లో ఉద్యోగిగా విధులు నిర్వర్తించారు. క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. అశ్విన్ క్రికెటర్గా ఎదిగే క్రమంలో నారాయణసామి కీలకపాత్ర పోషించినట్లు అశ్విన్ తండ్రి రవిచంద్రన్ మీడియాకు తెలిపారు.
ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నాడు. తాత నారాయణసామి మరణవార్తను అశ్విన్కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఇటీవలే రెండు నెలల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అశ్విన్ తాతను చివరిసారిగా చూసేందుకు రాలేకపోయాడు.
ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం టీమిండియా తన తొలి వార్మప్ మ్యాచ్లో భాగంగా న్యూజిలాండ్తో తలపడింది. తమిళనాడుకు చెందిన అశ్విన్ తన బాధను దిగమింగుకుని ఈ మ్యాచ్లో పాల్గొన్నాడు. ఈ మ్యాచ్లో 6 ఓవర్లు వేసిన అశ్విన్ ఒక వికెట్ తీశాడు.
వార్మప్ మ్యాచ్: సత్తా చాటిన బౌలర్లు, కివీస్పై భారత్ విజయం
పేసర్లు భువనేశ్వర్ కుమార్ (3/28), మహ్మద్ షమి (3/47) విజృంభించడంతో ఆదివారం భారత్ తన తొలి సన్నాహక మ్యాచ్లో సత్తా చాటింది. డక్వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్పై 45 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో అశ్విన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.