ఆంటిగ్వా: వెస్టిండిస్ పర్యటనలో భాగంగా ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్డేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరుని కనబర్చి 566/8 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా టెస్టు కెప్టెన్ 283 బంతులను ఎదుర్కొని డబుల్ సెంచరీ చేశాడు.
దీంతో విదేశాల్లో తొలి డబుల్ సెంచరీ సాధించిన భారత జట్టు కెప్టెన్గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లీ ప్రదర్శనపై మాజీ క్రికెట్ దిగ్గజాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం కెరీర్లోనే అత్యుత్తమ ఫాంలో ఉన్న కోహ్లీ డబుల్ సెంచరీ సాధించడం ప్రత్యేకమే అయినప్పటికీ, దీనిపై పలువురు మాజీలు గొప్పగా అభివర్ణించడం లేదు.
కోహ్లీ డబుల్ ధమాకా: అజర్ రికార్డు బద్దలు, ఔట్
ఎందుకంటే బౌలర్లకు పిచ్ సహకరించని వేళ విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాడు నిలదొక్కుకుంటే పరుగుల వరద పారించడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా పండితులు చెబుతున్నారు. దీంతో పాటు తొలిటెస్టు తొలి రొజైన గురువారం నాడు 241 నిమిషాలపాటు క్రీజులో నిలదొక్కుకుని 147 బంతులను ఎదుర్కొని 84 పరుగులు చేసిన ధావన్ను ప్రశంసిస్తున్నారు.
340 నిమిషాలపాటు క్రీజులో నిలదొక్కుకుని డబుల్ సెంచరీ చేసిన కోహ్లీకి (283 బంతులు) ధీటుగా నైట్ వాచ్మెన్గా బరిలోకి దిగి 253 బంతులు ఎదుర్కొని 113 పరుగులు చేసి టెస్టు క్రికెట్లో మూడో సెంచరీ సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ప్రతిభను ఎవరూ పట్టించుకోకపోవడం కూడా ఆశ్చర్యమేస్తుంది.
అశ్విన్ ఆల్రౌండర్ అయినప్పటికీ జట్టులో స్ఫిన్నర్గా స్థానం దక్కించుకున్నాడు. లోయర్ ఆర్డర్లో టీమిండియాకు ఎంతగానో ఉపయోగపడే బ్యాట్స్మెన్. బౌలర్గా రాణిస్తూ విదేశీ గడ్డపై అది కూడా వెస్టిండిస్ పిచ్లపై సెంచరీ సాధించడం ఏమంత చిన్న విషయం కాదని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.
తొలి టెస్ట్లో పట్టు బిగించిన కోహ్లీ: 566/8 పరుగుల వద్ద డిక్లేర్
మరోవైపు తుది జట్టులో చోటు దక్కించుకున్న మురళీ విజయ్, పుజారా, రహానే వంటి బ్యాట్స్మన్ నిలదొక్కుకోని పిచ్లపై కోహ్లీకి అండగా నిలిచి అశ్విన్ చేసిన సెంచరీని అభిమానులకు షాక్కు గురి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే అశ్విన్ సెంచరీ సాధించే దిశగా ఆడిన షాట్లు కూడా అమోఘం.
ఒక రకంగా చూస్తే అశ్విన్ సాధించిన సెంచరీ విరాట్ కోహ్లీ సాధించిన డబుల్ సెంచరీ కంటే గొప్పదని చెప్పడం కూడా అతిశయోక్తి కాబోదు.