హైదరాబాద్: జస్టిస్ లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడంలో విఫలమవుతున్న బీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలిగించాలంటూ బీసీసీఐ పాలకుల కమిటీ (సీఓఏ) సుప్రీంకోర్టును కోరింది. బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా కార్యదర్శి అమితాబ్ చౌదరి, కోశాధికారి అనిరుధ్ చౌదరిలను తప్పించాలని సూచించింది.
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సూచించిన సంస్కరణలు అమలు చేయడంలో తాత్సారం చేస్తున్నారన్న కారణంతో వీరిని తప్పించాలని వినోద్ రాయ్, డయానా ఎడుల్జిలతో కూడిన ఇరువురు సభ్యుల కమిటీ అభిప్రాయపడింది. ఈ మేరకు తమ ఐదో స్టేటస్ రిపోర్టును సుప్రీం కోర్టుకు అందించింది.
తాజాగా 26 పేజీల నివేదికలో బోర్డు పనితీరుపై సుప్రీం కోర్టుకు సీఓఏ నివేదిక ఇచ్చింది. తిరిగి ఎన్నికలు నిర్వహించే వరకు బోర్డు పరిపాలన, నిర్వహణ బాధ్యతలు తమ కమిటీతోపాటు సీఈఓ రాహుల్ జోహ్రీ నేతృత్వంలోని ప్రొఫెషనల్ కమిటీకి అప్పగించాలని కోర్టును కోరింది.
అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేల తరహాలోనే ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లు లోధా కమిటీ సంస్కరణలు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించింది. వీరందరి నిర్లక్ష్యం కారణంగా మరో ఆరునెలల సమయం వృథా అయిందని విమర్శించింది.
'గతంలో అనురాగ్ ఠాకూర్, అజయ్ షిర్కేలను తొలిగించినట్టుగానే ప్రస్తుత ఆఫీస్ బేరర్లను కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే కోర్టు సూచించినట్టుగా సంస్కరణలను అమలు చేసే పరిస్థితిలో వారు లేరు. ఇప్పటికే ఆరు నెలల సమయం వృథా అయ్యింది. గతంలో కోర్టు ఇచ్చిన తీర్పును కావాలనే తప్పుగా అర్థం చేసుకుని ఎస్జీఎంలోనికి రాహుల్ జోహ్రిని అనుమతించలేదు' అని సీఓఏ ఆరోపించింది.
సుప్రీం కోర్టుకు సమర్పించిన తమ నివేదికలో సీఓఏ.. బీసీసీఐ ఆఫీస్ బేరర్లు పెట్టిన ఖర్చు వివరాలను కూడా పొందుపరిచింది. ఇందులో ప్రస్తుతం తాత్కాలిక కార్యదర్శిగా కొనసాగుతున్న అమితాబ్ చౌదరీ రూ.1.56 కోట్లు ఖర్చు చేయగా, అనిరుధ్ చౌదరీ రూ.1.71 కోట్లు ఖర్చులు చేసినట్లు పేర్కొంది.
మరోవైపు అజయ్ షిర్కే మాత్రం బోర్డు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం విశేషం. ఇక మాజీ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్(రూ.24 లక్షలు), సీకే ఖన్నా(రూ.6.52లక్షలు) తక్కువలో తక్కువ ఖర్చు చేశారని సీఓఏ తెలిపింది.