హైదరాబాద్: రెండేళ్ల నిషేధం పూర్తి చేసుకుని 2018 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ను కోచ్గా ఎంపిక చేసుకోవాలని చూస్తోంది.
ఈ మేరకు వార్న్తో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. షేన్ వార్న్ వైపు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మొగ్గు చూపడానికి ప్రధాన కారణం అతని సక్సెస్ అని అంటున్నారు. 2008లో ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకున్న రాజస్థాన్ జట్టుకు షేన్ వార్న్ నాయకత్వం వహించాడు.
ఈ నేపథ్యంలో రాజస్ధాన్ రాయల్స్ యాజమాన్యం వార్న్ సేవలను మరోసారి వినియోగించుకోవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ నేపథ్యంలో 2015లో చెన్నై సూపర్ కింగ్స్తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై రెండేళ్ల పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ ఏడాది జులై 14తో ఈ నిషేధం ముగియనుంది. దీంతో వచ్చే సీజన్ నుంచి ఈ రెండు జట్లు మళ్లీ ఐపీఎల్లోకి అడుగు పెట్టనున్నాయి. దీంతో జట్టు పునరాగమనం సమయంలో కోచ్గా షేన్వార్న్ ఉంటే బాగుంటుందని ఫ్రాంఛైజీ భావిస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం ఇంగ్లాండ్లో కామెంటేటర్గా పనిచేస్తున్న వార్న్ని ఫ్రాంఛైజీ సభ్యులు సంప్రదించారట.
నిజానికి కోచ్గా రాహుల్ ద్రవిడ్ను ఎంపిక చేయాలని రాయల్స్ యాజమాన్యం తొలుత భావించిందట. అయితే అండర్-19, భారత-ఎ జట్లకు కోచ్గా రెండేళ్ల పాటు ఉండేందుకు బీసీసీఐతో ద్రవిడ్ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం ఐపీఎల్ జట్లతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉండకూడదని నిబంధన ఉంది.
ఈ కారణం చేతనే ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటార్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ తప్పుకున్న సంగతి తెలిసిందే.