హైదరాబాద్: ఆస్ట్రేలియా టీ20 జట్టుకు ఆ దేశ క్రికెట్ దిగ్గజం, మాజీ టెస్టు కెప్టెన్ రికీ పాంటింగ్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించనున్నాడు. ఫిబ్రవరిలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరిస్కు ఆస్ట్రేలియా జట్టుకు పాంటింగ్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించనున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.
ఆస్ట్రేలియా గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్లలో ఒకడైన రికీ పాంటింగ్ తాత్కాలిక ప్రధాన కోచ్ జస్టిన్ లాంగర్, సహాయ కోచ్ జాసన్ గిలెస్పీలతో కలిసి పాంటింగ్ పనిచేయనున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ఆస్ట్రేలియా, శ్రీలంకల మధ్య మూడు టీ20ల సిరీస్ జరగనుంది.
ఈ సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 ఫిబ్రవరి 17న మెల్ బోర్న్లో జరగనుండగా, ఫిబ్రవరి 20న గీలాంగ్, ఫిబ్రవరి 22న అడిలైడ్లో జరగనుంది. ఇక జస్టిన్ లాంగర్ను చీఫ్ కోచ్గా, జాసెన్ గిలెస్పీ మరో అసిస్టెంట్ కోచ్గా ఉంటారని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.
టీ20 నైపుణ్యంలో ఆస్ట్రేలియాకు కొదవ లేదని లాంగర్, గిలెస్పీలతో కలిసి లక్ష్యాలను చేరుకునేందుకు ఉత్సాహంగాఎదురుచూస్తున్నానని ప్రకటన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రికీ పాంటింగ్ అన్నాడు. కెప్టెన్గా ఆస్ట్రేలియాకు వరుసగా రెండు వన్డే ప్రపంచకప్లు సాధించిపెట్టిన అరుదైన గుర్తింపుని పాంటింగ్ సొంతం చేసుకున్నాడు.
ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తర్వాత ఐపీఎల్లో ఆడిన పాంటింగ్, గత ఏడాది ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు చీఫ్ కోచ్గా కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 27,000కు పైగా పరుగులు చేసిన పాంటింగ్ 1999, 2003, 2007 ఆస్ట్రేలియా వరల్డ్ కప్ జట్టులో భాగస్వామిగా ఉన్నాడు.