హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనింగ్ ఇన్నింగ్స్ ఆడటంలో ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని మాజీ కెప్టెన్ అజాహరుద్దీన్ అన్నారు. జూన్ 1 నుంచి 18 వరకు ఇంగ్లాండ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే.
ఈ మెగా టోర్నీలో రహానే లేదా శిఖర్ ధావన్తో రోహిత్ ఓపెనింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న రోహిత్ శర్మ మిడిలార్డర్లో రావడం రోహిత్ ఓపెనింగ్ ఇన్నింగ్స్ను దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చాడు.
'ఓపెనింగ్ బ్యాట్స్మన్ ఎప్పుడూ ఓపెనర్గానే రావాలి. అత్యుత్తమ ఆటగాడెప్పుడూ తొలి 20 ఓవర్లు తప్పక ఆడాలని భావిస్తా. అత్యుత్తమ బ్యాట్స్మన్ టీ20ల్లో 8-10, వన్డేల్లో 30 ఓవర్ల తర్వాత వస్తే ఉపయోగం ఉండదు. రోహిత్ మంచి ఆటగాడు. ముంబయి తరఫున అతడు 2, 4, 5 స్థానాల్లో ఆడడం నన్ను విస్మయపరిచింది' అని అన్నాడు.
'అతడు త్వరగా ఓపెనింగ్కు సిద్ధమవ్వాలి. గాయం తర్వాత కఠిన పరిస్థితుల్లో ఓపెనింగ్కు రావడం వల్ల రోహిత్ ఇబ్బందులు పడొచ్చు. ఇలాంటి అన్ని విషయాలను కూడా రోహిత్ తమ మెదడులో ఉంచుకోవాలి' అని అజారుద్దీన్ గుర్తు చేశాడు. అంతేకకాదు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలవకుంటే తాను నిరాశకు లోనవుతానని కూడా అన్నాడు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్మెన్, బౌలర్లు, స్పిన్నర్లు ఉన్నారని చెప్పాడు. 50 ఓవర్లు గ్లోబల్ టోర్నీ అయిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంగ్లాండ్ వేల్స్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 1 నుంచి 18 వరకు టోర్నీ జరగనుంది. ఛాంపియన్స్ టోర్నీకి ముందు మే 26 నుంచి 30 వరకు ప్రాక్టీస్ మ్యాచ్లు జరగనున్నాయి.