బెంగళూరు: బెంగళూరులో శనివారం నాడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలంలో కొత్తగా మురుగన్ అశ్విన్ పేరు వినిపించింది. అతడిని పుణే జట్టు రూ.4.5 కోట్లకు సొంతం చేసుకుంది. బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ నెల రోజుల క్రితమే డ్రాఫ్టులో పుణే సొంతమయ్యాడు.
అయితే శనివారం వేలంలో మళ్లీ అశ్విన్ పేరు కనిపించడం ఆశ్చర్యపరిచింది. ఈ అశ్విన్.. రవిచంద్రన్ అశ్విన్ కాదు. ఇతను మురుగన్ అశ్విన్. తమిళనాడు ఆటగాడే అయిన మురుగన్.. రవిచంద్రన్ అశ్విన్కు మిత్రుడు కావడం గమనార్హం.
పుణె ఇతణ్ని ఎంచుకోవడానికి రవిచంద్రన్ సిఫార్సు కూడా ఓ కారణం. అయితే 25 ఏళ్ల ఈ లెగ్ స్పిన్నర్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అంత గొప్ప రికార్డేమీ లేదు. మూడు ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఒక్క వికెట్టే తీశాడు. లిస్ట్-ఎల్లోనూ రికార్డు పేలవం.
కానీ ఇటీవల ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 23 ఓవర్లు విసిరి 5.52 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టడంతో అందరి దృష్టి ఇతని పైన పడింది. ఈ ప్రదర్శన అతడి కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీ పడేలా చేసింది. ఎం అశ్విన్ కనీస ధర (రూ.10 లక్షలు)కు ఇది 45 రెట్లు కావడం విశేషం.
తానను రూ.4.5 కోట్లకు పుణే కొన్న విషయమై మురుగన్ అశ్విన్ స్పందిస్తూ... వేలంలో తనను ఎంచుకుంటారని ఊహించానని, కానీ ఇంత ధర వస్తుందని అనుకోలేదన్నాడు. నా పేరు చివర్లో రావడంతో ఒత్తిడికి గురయ్యానన్నాడు. ఫ్రాంఛైజీ తనను కొన్నందుకు సంతోషగా ఉందని, నేను డబ్బు గురించి ఆలోచించలేదని, ఐపీఎల్ ఫ్రాంఛైజీకి ఆడి అనుభవం సంపాదించాలనుకున్నానని చెప్పాడు.
ఐపీఎల్ వేలంలో కచ్చితంగా అమ్ముడవుతారనుకున్న కొందరు ఆటగాళ్లను కొనేందుకు ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. న్యూజిలాండ్ ఓపెనర్ గప్తిల్, శ్రీలంక ఆల్రౌండర్ మాథ్యూస్, విండీస్ ఆల్రౌండర్ డారెన్ సామి, ప్రజ్ఞాన్ ఓజా, పుజారా, మనోజ్ తివారీ, దిల్షాన్, ఆమ్లా, బెయిలీ, హడిన్, బొపారా, జయవర్దనె, మైకేల్ హసి, ఉస్మాన్ ఖవాజా లాంటి వాళ్లపైనా ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.