కొచ్చి: కేరళ హైకోర్టు తనపై నిషేధాన్ని ఎత్తివేసినా బీసీసీఐ మాత్రం శ్రీశాంత్ను కరుణించేలా లేదు. స్కాట్లాండ్ లీగ్ లో ఆడేందుకు అనుమతివ్వాలంటూ బీసీసీఐకి ఎన్ఓసీ(నాన్ ఆబ్జెక్షన్ సర్టిఫికెట్) పంపిస్తే.. ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించాడు.
స్కాట్లాండ్ లీగ్ ఇప్పటికే చివరి దశకు వచ్చేసిందని, కనీసం ఇప్పటికైనా బీసీసీఐ తనకు అనుమతివ్వకపోతే లీగ్ లో ఆడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతానని పిటిషన్లో శ్రీశాంత్ పేర్కొన్నాడు. కోర్టు జోక్యం చేసుకుని బీసీసీఐ నుంచి త్వరితగతిన స్పందన వచ్చేలా చూడాలని కోరాడు.
కాగా, ఐపీఎల్లో ఫిక్సింగ్ కు పాల్పడి బీసీసీఐ చేత నిషేధం ఎదుర్కొంటున్న శ్రీశాంత్.. కేరళ హైకోర్టు దాన్ని ఎత్తివేయడంతో ఊపిరి పీల్చుకున్నాడు. అగస్టు 7న కేరళ హైకోర్టు అతనిపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై న్యాయపోరాటం చేయడానికి అటు బీసీసీఐ కూడా సన్నద్దమవుతోంది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్కు అప్పీల్ చేసే యోచనలో బీసీసీఐ ఉంది. బీసీసీఐ కోర్టుకు వెళ్తే మాత్రం స్కాట్లాండ్ లీగ్కు సంబంధించి శ్రీశాంత్కు ఎన్ఓసీ రావడం కష్టమే అని చెప్పాలి.