హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోమవారం 44వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభిమానులు, సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ తెలిపారు. సచిన్ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలి పాటను విడుదల చేశారు.
'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు. సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా జేమ్స్ ఎర్స్కైన్ అనే దర్శకుడు 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మే 26న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుండగా, ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదలైన 12 గంటల సమయంలోనే ఏకంగా 48 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో సచిన్ బాల్యం, క్రికెట్ కెరీర్, వ్యక్తిగత జీవితం, ముఖ్య ఘట్టాల గురించిన సన్నివేశాలుంటాయి. ధోనీ: ద అన్టోల్డ్ స్టోరీ సినిమా వచ్చినా, అందులో ధోని నటించలేదు. ఈ సినిమాలో మాత్రం సచిన్ టెండూల్కరే స్వయంగా నటించారు.