హైదరాబాద్: సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) సభ్యులపై టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సచిన్, గంగూలీ, లక్ష్మణ్లతో కూడిన సీఏసీకి టీమిండియా ప్రధాన కోచ్ను ఎంపిక చేసే అర్హత లేదని పాటిల్ విమర్శించాడు.
కొత్త మలుపు తిరిగిన బౌలింగ్ కోచ్ కథ: రవిశాస్త్రి అండ్ టీమ్ కాంట్రాక్టులు ఆపండి!
'సచిన్, గంగూలీ, లక్ష్మణ్లు నిస్సందేహంగా లెజండరీ క్రికెటర్లు. ఆటగాళ్లుగా వారు దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. కానీ వీరిలో ఏ ఒక్కరూ కోచ్లుగా పనిచేయలేదు. అలాంటి వీరు కోచ్ను ఎంపికచేయడం.. కోచ్లు అంపైర్లను ఎంపిక చేసిన మాదిరిగా ఉంది' అని పాటిల్ వ్యాఖ్యానించాడు.
మిడ్ డే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో సందీప్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. రవిశాస్ర్తిని ప్రధాన కోచ్గా ఎంపిక చేసిన విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరును కూడా పాటిల్ తప్పుబట్టాడు. కోచ్ ఎంపిక వ్యవహారంలో బోర్డు తీరు 'ఇతరులపై నెపం నెట్టివేసే చందం'గా ఉందని ఆయన అన్నారు.
'తదుపరి కోచ్ను మేం గుర్తించాం. ఇక మిగిలిన ప్రక్రియ పూర్తి చేయాల్సిందే మీరే అన్నట్టు బీసీసీఐ వ్యవహరించిది. లోథా కమిటీ సంస్కరణలు అమలు చేయలేదన్న విమర్శలను తప్పించుకొనేందుకే బోర్డు ఇలా చేసింది' అని సందీప్ పాటిల్ విమర్శించాడు.
కోచ్గా ఎంపికైన శాస్త్రి సీఏసీని మోసం చేశాడా?: సచిన్ ఘాటైన లేఖ
ప్రధాన కోచ్ను ఎంపిక చేసి తప్పుకోవాల్సిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) బౌలింగ్ కోచ్గా జహీర్ ఖాన్ను, బ్యాటింగ్ కన్సల్టెంట్గా రాహుల్ ద్రవిడ్ని నియమించడంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. జట్టు సహాయక సిబ్బంది ఎంపిక తన ఇష్టమని, ఆ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటానని రవిశాస్త్రి చెప్పడంతో కోచ్ కథ కొత్త మలుపు తిరిగింది.
జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రిని ఎంపిక చేయడంపై సీఓఏ హర్షం వ్యక్తం చేసినా.. బ్యాటింగ్, బౌలింగ్ కోచ్లుగా రాహుల్ ద్రవిడ్, జహీర్ ఖాన్లను తీసుకోవడంపై కమిటీ కూడా అంత సుముఖంగా లేదు. ఈ ఎంపికతో సీఏసీ తమ పరిధిని దాటి వ్యవహరించిందని పరిపాలక కమిటీ భావిస్తోంది.
దీంతో పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన బీసీసీఐ పరిపాలనా కమిటీ (సీఓఏ) నేరుగా రంగంలోకి దిగింది. రవిశాస్త్రితో పాటు జహీర్, ద్రవిడ్లకు ఇచ్చే కాంట్రాక్టులు ప్రక్రియను ఆపేయాలని బోర్డును ఆదేశించిన సంగతి తెలిసిందే.