హైదరాబాద్: టీమిండియా కొత్త కోచ్ ఎంపిక కోసం సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందంటూ 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' పత్రికలో వచ్చిన కథనం చర్చనీయాంశమైంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
అయితే ఆ పత్రికలో వచ్చిన వార్తా కథనాన్ని బీసీసీఐ ఖండించింది. అవన్నీ నిరాధార, కల్పిత వార్తలుగా కొట్టివేసింది. తమ సేవలను జీతం తీసుకోకుండా కేవలం గౌరవార్థం చేయలేమని గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో కూడిన సీఏసీ... బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రికి చెప్పినట్టు ఆ కథనంలో వచ్చింది.
'పత్రికలో వచ్చిన కథనం పూర్తిగా నిరాధారం. కోచ్ ఎంపిక కోసం సీఏసీ డబ్బులను డిమాండ్ చేసినట్టు వచ్చి వార్తల్లో నిజం లేదు. క్రికెట్ కోసం సేవ చేస్తున్న దిగ్గజాల గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించడం దారుణం. వారి మార్గదర్శకం, సూచనలు భారత క్రికెట్కు మేలు చేసేవి. ఇలాంటి వార్తలను ఆ పత్రిక ఉపసంహరించుకోవాలి. వెంటనే ఆ ఆర్టికల్పై వివరణ ఇవ్వాలి' అని బీసీసీఐ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది.
సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) లండన్లో బోర్డు సీఈవో రాహుల్ జోహ్రీతో సమావేశమైంది. ఈ సందర్భంగా తమ సేవలను ఉచితంగా అందించే అవకాశం లేదని జోహ్రీకి స్పష్టం చేసినట్టు ఆ పత్రిక తన వార్తా కథనంలో ప్రచురించింది.
కోహ్లీ.. కుంబ్లేతో సర్దుకుపో!: బీసీసీఐ కొత్త రాగం
ఇదిలా ఉంటే కోచ్ ఎంపికపై గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో కూడిన సీఏసీ గురువారం సాయంత్రం సమావేశమై రెండు గంటలపాటు చర్చలు జరిపింది. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం తమకు మరింత సమయం కావాలని బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రిని కమిటీ కోరింది.
'సీనియర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ ఎంపిక కోసం సీఏసీ గురువారం సమావేశమైంది. తగిన సమయంలో నిర్ణయం తీసుకుని తిరిగి బీసీసీఐకి తెలుపుతుంది' అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరి తెలిపారు. దీంతో కుంబ్లేతో మరికొంత కాలం సర్దుకుపోవాలని కెప్టెన్ కోహ్లీకి బీసీసీఐ సూచించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత వెస్టిండీస్ పర్యటనకు కూడా కుంబ్లేనే కోచ్గా వెళ్లనున్నాడు. 'వెస్టిండీస్ పర్యటనకు కుంబ్లేనే కోచ్గా వెళ్తాడు. అది స్వల్పకాలిక పర్యటన. కాబట్టి ఇబ్బందులు ఉండకపోవచ్చు. కొత్త కోచ్ ఎంపికపై నిర్ణయం తీసుకునేవరకు కుంబ్లేతో సర్దుకుపోవాలని కోహ్లికి సూచించాం' అని బోర్డు అధికారి ఒకరు చెప్పారు.