హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్... వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కోసం త్వరలో బ్యాట్ పట్టనున్నాడు. క్రికెట్లో అన్ని ఫార్మెట్లకు సచిన్ టెండూల్కర్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. అయితే అభిమానుల కోసం మే 13వ తేదీన మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.
విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా పేరిట 15 వేల సామర్థ్యం గల స్టేడియాన్ని ట్రినిడాడ్లో నిర్మించారు. ఈ స్టేడియాన్ని మే 13న ప్రారంభించనున్నారు.
స్టేడియం ఆరంభ వేడుకల్లో భాగంగా ఓ మ్యాచ్ని నిర్వాహించాలని సదరు నిర్వాహకులు భావించారు. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారాలు అలరించనున్నారు. ఒక జట్టుకు సచిన్ కెప్టెన్గా వ్యవహరిస్తుండగా, మరోక జట్టుకు లారా కెప్టెన్సీ బాధ్యతలను నిర్వహించనున్నారు.
ఈ మ్యాచ్ని ఇంటర్నేషనల్, రీజనల్, లోకల్లో ప్రసారం చేస్తామని ట్రినిడాడ్, టోబాగో క్రీడల మంత్రి స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. మ్యాచ్కి సంబంధించిన టికెట్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.
వెస్టిండిస్ క్రికెట్కు విశేష సేవలందించిన క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరుని ఈ స్టేడియానికి పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు. నిజానికి ఈ స్టేడియాన్ని ఐసీసీ వరల్డ్ కప్ 2007నాటికే అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు.
కానీ, నిర్మాణ వ్యయం తలకు మించిన భారంగా మారడంతో 2017 మార్చి నాటికి అత్యాధునిక హంగులతో మే 13 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చారు. వెస్టిండిస్ క్రికెట్కు 16 ఏళ్ల పాటు లారా సేవలందించాడు. వెస్టిండిస్ తరుపున 131 టెస్టులాడిన లారా 11,954 పరుగులు చేశాడు. ఇందులో 34 సెంచరీలు ఉన్నాయి.