బెంగళూరు: క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. 'గల్ఫ్ న్యూస్'తో కోహ్లీలో ప్రత్యేకమైన ప్రతిభ ఉందని, అంతేగాక, అతని క్రమశిక్షణ, ఆట పట్ల అతని అంకితభావం చూస్తే ముచ్చటేస్తుందని అన్నారు.
కోహ్లీ మానసికంగా ఎంతో దృఢంగా ఉంటాడని సచిన్ పేర్కొన్నాడు. ఎలాంటి బంతినైనా ఎదుర్కొనే సత్తా కోహ్లీలో ఉందని కొనియాడాడు. అతని క్రమశిక్షణా, అంకితభావమే అతడ్ని క్రికెట్లో అగ్ర స్థానానికి తీసుకొస్తోందని తెలిపాడు. ఒత్తిడిలో కూడా కోహ్లీ ఎంతో సమయస్ఫూర్తితో ఆడగలడని సచిన్ ప్రశంసించాడు.
ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్లో అద్భుత ఫాంతో కొనసాగుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటికే నాలుగు శతకాలు సాధించాడు. అంతేగాక, లీగ్లో అత్యధిక పరుగులు కూడా నమోదు చేశాడు. 919 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ.. మరో 81 పరుగులు చేస్తే ఒక లీగ్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డ్ సృష్టించనున్నాడు.
అంతేగాక, పలు అంతర్జాతీయ రికార్డులను సైతం కోహ్లీ బ్రేక్ చేశాడు. దీంతో కోహ్లీని సచిన్ టెండూల్కర్తో పోల్చడం మొదలుపెట్టారు కొందరు విశ్లేషకులు. అయితే, తనను దిగ్గజం సచిన్తో పోల్చవద్దని కోరాడు కోహ్లీ.
'నన్ను సచిన్తో పోల్చడం సరికాదు. అతడ్ని ఎవరితోనూ పోల్చలేం. అతనో విభిన్నమైన శక్తిగల ఆటగాడు. నేను చిన్ననాటి నుంచి ఆయన ఆటను చూసుకుంటూ పెరిగాను. టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తూ సేవలందిస్తున్నందుకు నాకు ఆనందంగా ఉంది. సచిన్ స్ఫూర్తితోనే నేను ఎదిగాను. నాకంటూ ప్రత్యేకమైన మార్గాన్ని నిర్దేశించుకున్నాను' అని కోహ్లీ సచిన్తో పోల్చడంపై సమాధానమిచ్చాడు.
కోహ్లీ టెస్టుల్లో 2,994, అంతర్జాతీయ వన్డేల్లో 7,212, టీ20ల్లో 1,641 పరుగులు చేశాడు. కాగా, జింబాబ్వే పర్యటనకు వెళ్లే భారత వన్డే జట్టులో కోహ్లీకి స్థానం కల్పించలేదు. జూనియర్ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చేందుకే కోహ్లీకి విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.