హైదరాబాద్: ఐపీఎల్ పదో సీజన్లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు వాంఖడే స్టేడియంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోమవారం 44వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ స్టేడియం, మధ్యలో బ్యాట్, బంతి ఆకారంలో ఉన్న కేక్ను సచిన్తో కట్ చేయించాడు. అనంతరం ఇద్దరూ కలిసి కేక్ తిన్నారు. సచిన్ బర్త్డే వేడుకను మ్యాచ్ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు తిలకించి 'హ్యాపీ బర్త్డే సచిన్' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.
అంతేకాదు సచిన్ సచిన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సచిన్ కోసం హ్యాపీ బర్త్ డే పాటను సైతం పాడారు. ప్రస్తుతం సచిన్ ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్గా కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పూణె నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది.
Happy Birthday🎁🤘 @sachin_rt Couldn't think of a better way than to have your @mipaltan fans sing it to you in front of your own stand @IPL pic.twitter.com/B3VTzcueum
— Matthew Hayden AM (@HaydosTweets) 24 April 2017
దీంతో ముంబైకి 161 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సచిన్ బర్త్ డే సందర్భంగా సోమవారం బయోపిక్ 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్'లోని తొలి పాటను విడుదల చేశారు. 'హింద్ మేరే జింద్' అనే ఈ పాటకు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చాడు.
సచిన్ జీవిత చరిత్ర ఆధారంగా జేమ్స్ ఎర్స్కైన్ అనే దర్శకుడు 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' పేరుతో సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మే 26న ఈ మూవీ తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానుండగా, ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేశారు.