ముంబై: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో తాను ప్రేమలో పడిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇటీవల ముంబైలో డీబీఎస్ బ్యాంక్ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ టెండూల్కర్ తన ప్రేమకు సంబంధించిన విశేషాలను మీడియా సమావేశంలో పంచుకున్నారు.
స్మార్ట్ ఫోన్లు లేని కాలంలో తమ ప్రేమ వికసించిందని, దీంతో ఇద్దరి మధ్య సమాచార మార్పిడికీ ఎక్కువ సమయం పట్టిందని తెలిపాడు. అంజలితో తన ప్రేమ వ్యవహారం తమ కుటుంబ సభ్యులకు తప్ప మరెవరికీ తెలియదని పేర్కొన్నారు.
అంజలి ముంబైలోని జేజే హాస్సిటల్స్లో చుదువుకోవడంతో పాటు అక్కడే నివసించేదని, ఆ సమయంలో ఆమెను కలిసేందుకు వెళ్లేముందు బాంద్రా నుంచి ల్యాండ్ లైన్ ద్వారా ఫోన్ చేసి గంటలోగా తనని కలుస్తానని చెప్పి అక్కడికి వెళ్లేవాడినని చెప్పుకొచ్చారు.
అయితే అప్పట్లో బాంద్రా నుంచి వర్లీకి వెళ్లేందుకు సముద్రమార్గం లేదని, అంజలితో మాట్లాడాలంటే కేవలం ల్యాండ్ లైన్లు మాత్రమే అందుబాటులో ఉండేవని తెలిపారు. ఇలా కష్టపడి అంజలి కోసం తాను ఆసుపత్రికి చేరేసరికి, ఎమర్జెన్సీ కేసులు లేదా పేషెంట్లకు సూచనలిచ్చే పనిలో బిజీగా ఉండేదని తెలిపారు.
నిజం చెప్పాలంటే తనను కలవడం కూడా వీలయ్యేది కాదని అన్నాడు. ఈ క్రమంలో అంజలి కోసం తాను వెళ్లేటప్పుడు ఆమె కలుస్తుందో లేదోనని భయం తనకు కలిగేదని సచిన్ టెండూల్కర్ చెప్పారు. ఒక్కోసారి అంజలి తనను కలవడం లేదనే విషయం తెలిసినా తాను మళ్లీ బాంద్రా వెళ్లి ఆమెకు మరో ఫోన్కాల్ చేసి, మళ్లీ వస్తున్నానని చెప్పి కలిసేవాడినని చెప్పారు.
ఆ కాలంలో ఇంతటి టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వల్ల సమాచారం చేరవేసేందుకు చాలా సమయం పట్టేదన్నారు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ సాయంతో నిమిషాల్లో లేదా ఒక ఫోన్ కాల్తో మాట్లాడటం లేదా మేసేజ్ పంపుకోవచ్చని తెలిపారు.