హైదరాబాద్: భారత క్రికెట్ ప్రక్షాళన కోసం లోధా కమిటీ సూచించిన సిఫారసులు దేశంలోని మిగతా క్రీడా సంఘాల్లో అమలు కానున్నాయా? ఆ దిశగా సుప్రీం కోర్టు చర్యలు తీసుకోనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. బీసీసీఐ పాలనా వ్యవహారాలపై జస్టిస్ ఆర్ఎం లోధా కమిటీ సంస్కరణల అమలు ఎంత ప్రభావాన్ని చూపిందో మనకు తెలిసిందే.
ఇదే విధంగా దేశంలోని అన్ని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల్లోనూ లోధా కమిటీ సూచించిన సిఫారసులను అమలు చేయాలని సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) నమోదైంది. ఒలింపియన్లు, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలు సహా మొత్తం 28 మంది క్రీడాకారులు కలిసి ఈ పిటిషన్ను దాఖలు చేశారు.
జాతీయ క్రీడా సంఘాల్లో నిర్వహణ లోపం కనిపిస్తోందని, పారదర్శకత కనిపించడం లేదని పిటిషన్లో ఆరోపించారు. ఈ నేఫథ్యంలో లోధా కమిటీ సిఫారసులను జాతీయ క్రీడల అభివృద్ధి కోడ్లో చేరిస్తే అన్ని జాతీయ క్రీడా సమాఖ్యలు, రాష్ట్ర సంఘాలు పారదర్శకంగా పని చేస్తాయని వారు వివరించారు.
అందుకే ప్రతీ ఎన్ఎస్ఎఫ్లో లోధా ప్యానెల్ సంస్కరణలను అమలు చేయాలని కోరారు. ఈ పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ జగ్దీశ్ సింగ్ ఖేహర్, జస్టిస్ ఎన్.వి రమణ, జస్టిస్ డి.వై చంద్రచూడ్తో కూడిన సుప్రీం ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు, భారత ఒలింపిక్ సంఘం, భారత స్పోర్ట్స్ అథారిటీలకు నోటీసులు పంపింది. ఈ కేసును సుప్రీం కోర్టు బీసీసీఐ కేసుతో జత చేసింది.