హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నాడు. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా ఓవల్ వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ సూపర్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ | ఫోటోలు | స్కోరు కార్డు
దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో మూడు సెంచరీలు సాధించిన గిబ్స్, గంగూలీ, గేల్ సరసన నిలిచాడు. మరోవైపు అత్యధిక వేగంగా 10 సెంచరీలు చేసిన మూడో క్రికెటర్గా ధావన్ అవతరించాడు. ట్రోఫీలో 7 ఇన్నింగ్స్ల్లో 500కు పైగా పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
గంగూలీ (8 ఇన్నింగ్స్ల్లో) సాధించిన రికార్డుని సైతం అధిగమించాడు. ఇక శ్రీలంకపై వరుసగా ఐదు వన్డేల్లో 50కి పైగా పరుగులు చేసిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో గంగూలీ(665), రాహుల్ ద్రవిడ్(627)ల తర్వాత అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్మెన్గా ధావన్ నిలిచాడు.
ఈ క్రమంలో శిఖర్ ధావన్ 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మలింగ్ బౌలింగ్లో అవుటయ్యాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లకు 6 వికెట్లు నష్టపోయి 321 పరుగులు చేసింది. దీంతో శ్రీలంకకు 322 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం 322 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక నిర్ణీత 48.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. ఛేదనకు దిగిన శ్రీలంకను కట్టడి చేయడంతో బౌలర్లు విఫలమయ్యారు. దీంతో టీమిండియా... శ్రీలంక చేతిలో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. శ్రీలంకను తేలికగా తీసుకుని టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంది.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ఓపెనర్లు ధావన్, రోహిత్ శర్మలు చక్కటి శుభారంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కు 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధికంగా 50కి పైగా భాగస్వామ్యాలు నెలకొల్పిన క్రిస్గేల్, చందర్పాల్ రికార్డుని బద్దలు కొట్టారు.