హైదరాబాద్: 1996లో ఇంగ్లాండ్లో తన తొలి టెస్టు పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సత్తా చాటిన సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యనటక గంగూలీకి మధుర జ్ఞాపకాలు పంచడంతో పాటు ఒక భయంకర అనుభవాన్ని కూడా మిగిల్చిందంట.
ఆనాటి ఇంగ్లాండ్ పర్యటనలో సౌరభ్ గంగూలీ లార్డ్స్ స్టేడియంతో పాటు ట్రెంట్ బ్రిడ్జిలో వరుస సెంచరీలతో చెలరేగిపోయాడు. ఆ సిరిస్లో సత్తా చాటడంతో టీమిండియాలో తన స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. అంతేకాదు తన కెరీర్లోనే అత్యుత్తమ టెస్టు సెంచరీగా లార్డ్స్ సెంచరీని పేర్కొనడం పలు సందర్భాల్లో మనం చూశాం.
ఇటీవల ఓ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న దాదా ఆనాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు. సిరీస్ మధ్యలో ఒకసారి గంగూలీ తన బంధువులను కలిసేందుకు కావెండిష్ నుంచి పిన్నార్కు లండన్ అండర్గ్రౌండ్ ట్రైన్ (ట్యూబ్)లో ప్రయాణించాడు.
ట్రైన్లో గంగూలీతోపాటు మరో క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఉన్నాడు. వాళ్లు కూర్చున్న క్యారేజ్లో టీనేజర్లు అయిన ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిల బృందం కూడా ఉంది. వారిలో బీరు తాగిన ఒకడు ఖాళీ క్యాన్ను వీరిపై విసిరేశాడంట.
దీనిని పట్టించుకుని సౌరభ్ గంగూలీ ఆ బీర్ క్యాన్ను పెట్టి గొడవ వద్దంటూ సిద్ధూని కూడా వారించాడంట. అయితే అక్కడితో ఆగని ఆ కుర్రాడు మాటల దాడి చేస్తూ వీరిద్దరిపైకి దూసుకొచ్చాడు. ఈ సమయంలో దాదా కాస్తంత సంయమనం పాటించినా, సిద్ధూ వెనక్కి తగ్గకపోవడంతో గొడవ మరింత పెద్దది అయింది.
దీంతో గంగూలీ ఏది అయితే అయింది అన్నట్లుగా సిద్ధూతో జత కలిసి ఆ కుర్రాడితో గొడవకు దిగాడని చెప్పాడు. ఇంతలో ఊహించని విధంగా అటువైపు నుంచి స్పందన వచ్చింది. కింద పడ్డ ఆ కుర్రాడు ఒక్కసారిగా తుపాకీ బయటకు తీసి దాదా ముఖంపై గురి పెట్టాడు.
'నా జీవితం ఇక్కడ ట్రెయిన్లోనే ముగిసిపోయింది అనుకున్నాను' అని దాదా గుర్తు చేసుకున్నాడు. అయితే వీరి అదృష్టం ఏమిటంటే ఆ కుర్రాళ్లతో పాటు పక్కనే బాగా బలంగా ఉన్న ఓ అమ్మాయి అతిడిని పట్టుకుని బలంగా వెనక్కి లాగింది. ఇంతలో స్టేషన్ రావడంతో అతడిని తీసుకపోయింది.
ఆ అమ్మాయి చాలా బలంగా ఉందని, తనకు తెలిసి ఆ అమ్మాయితో ఆ కుర్రాడు కలిసి ఉండకపోవచ్చని గంగూలీ తెలిపాడు. ఆ తర్వాత ఎప్పుడు ఇంగ్లాండ్లో తిరగాలని అనిపించినా దాదా తన సొంత కారులో డ్రైవింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడని చెప్పాడు.