హైదరాబాద్: గతంలో డానిష్ కనేరియా రూపంలో ఓ హిందువు పాకిస్ధాన్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మనీందర్ పాల్ సింగ్ అనే సిక్కు కుర్రాడు అలాంటి ఘనతే సాధించాడు. ఫాస్ట్ బౌలర్ల కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోని జాతీ సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసిన ఓ క్యాంప్కు ఎంపికయ్యాడు.
నవంబర్ 21న ముల్తాన్లోని పీసీబీ ఏర్పాటు చేసిన ఈ క్యాంప్కు మనీందర్ పాల్ సింగ్ ఎమెర్జింగ్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టులో చోటు సంపాదించిన తొలి సిక్కు ఆటగాడిగా 21 ఏళ్ల మనీందర్ రికార్డులకెక్కాడు. ఈ సందర్భంగా మనీందర్ పాల్ సింగ్ మాట్లాడుతూ క్యాంప్కు ఎంపికైనందుకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉందని అన్నాడు.
పాకిస్థాన్లోని గిరిజన తెగకు చెందిన మనీందర్ లాహోర్ సరిహద్దు ప్రాంతమైన నంకానా సాహిబ్లో నివసిస్తున్నాడు. ఐదుగురు అన్నదమ్ముల్లో పాల్ సింగ్ పెద్దవాడు కాగా, సిక్కు కమ్యూనిటీలో ఈ స్ధాయికి ఎదిగిన తొలి క్రికెటర్ ఇతనే కావడం గమనార్హం. దేశంలోని నైపుణ్యం ఉన్న ఇతర క్రికెటర్లతో కలిసి శిక్షణ తీసుకోవడం గొప్ప అనుభవమని పేర్కొన్నాడు.
ఇక్కడా చాలా విషయాలు నేర్చుకున్నానని, ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడటమే తన లక్ష్యమని పేర్కొన్నాడు. తనకు క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టమని, మెట్రిక్యులేషన్ తర్వాత క్లబ్స్థాయిలో ఆడానని, లాహోర్లోని అకాడమీలో కూడా ఆడా అని మనీందర్ పేర్కొన్నాడు. మనీందర్ పాల్ సింగ్ ప్రస్తుతం పంజాబ్ యూనివర్సిటీలో ఫార్మసీ విద్యార్ధిగా ఉన్నాడు.
15 ఏళ్ల క్రితం పాల్ సింగ్ తండ్రి... నాన్కాన్ సాహెజ్ ప్రాంతం నుంచి పాకిస్థాన్లోని కైబర్ ఏజెన్సీ ప్రాంతానికి వలస వచ్చారు. పాల్ సింగ్ తండ్రి కూడా స్వతహాగా క్రికెట్ లవర్ కావడం విశేషం.