హైదరాబాద్: ఆతిథ్య శ్రీలంకతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన కోహ్లీసేనకు మరో వైట్ వాష్ లభించడం కష్టమేనని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. ఐదు వన్డేల సిరిస్లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం ప్రారంభం కానున్న సంగతి తెలసిందే.
ఈ సందర్భంగా గవాస్కర్ మీడియాతో మాట్లాడాడు. ఐదు వన్డేల సిరిస్ను కోహ్లీసేన 4-1తో కైవసం చేసుకుంటుందని గవాస్కర్ అన్నాడు. టీమిండియాతో జరిగే పరిమిత ఓవర్ల క్రికెట్లో శ్రీలంక మెరుగ్గా రాణిస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశాడు. కాబట్టి భారత్కు మరో క్లీన్ స్వీప్ రావడం అంత సులభం కాదని అన్నాడు.
'భారత్ 4-1 తేడాతో వన్డే సిరీస్ను సాధిస్తుందని అనుకుంటున్నా. వన్డే క్రికెట్లో లంకేయలు ఆశించిన స్థాయిలో రాణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లంక ఆటగాడు ఉపుల్ తరంగా వన్డేల్లో ప్రమాదకరమైన ఆటగాడు. అతనికి వన్డేల్లో మంచి రికార్డే ఉంది. భారత్ జట్టుకు అతను సవాల్గా నిలిచే అవకాశాలు లేకపోలేదు' అని గవాస్కర్ అన్నాడు.
మరోవైపు కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇంటా, బయటా అద్భుతంగా ఆడుతోందని అన్నాడు. తెలుపు కన్నా ఎరుపు రంగు బంతి మరింత స్వింగ్ అవుతుందని అన్నారు. ఇక లంక ఓపెనర్లు బాగా ఆడితే వారికి శుభారంభాలు లభిస్తాయి. శ్రీలంక తరంగా, దినేశ్ చండిమాల్, కుశాల్ మెండిస్తో బ్యాటింగ్ పరంగా బాగుందని అన్నాడు.
శ్రీలంక బౌలింగ్ మాత్రం ఇంకా బలహీనంగానే ఉందని గవాస్కర్ చెప్పాడు. దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్లో భారత్-ఏ కెప్టెన్గా రాణించిన మనీశ్ పాండే టీమిండియా తరఫున ఆడేందుకు అర్హుడని గవాస్కర్ పేర్కొన్నాడు.