హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్యూలో కోహ్లీ చాలా దూకుడుగా వ్యవహరిస్తాడని, ఒక్కోసారి అతన్ని చూస్తే తనకు భయమేస్తుందని అశ్విన్ అన్నాడు. ఫీల్డింగ్ సెట్ చేయడంలో ఇది స్పష్టంగా కనిపిస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు.
పలుసార్లు మైదానంలో తన వద్దకు వచ్చి పలానా పొజిషన్లో ఉన్న ఫీల్డర్ను ఎందుకు తీసేశావని తనను అడిగాడని అశ్విన్ చెప్పాడు. రెండేళ్లులో ఓ ప్లేయర్గా విరాట్ కోహ్లీ ఎంతో పరిణతి సాధించడానికి, ఓ తరాన్ని మార్చగలిగే సత్తా ఉన్న ప్లేయర్ అతడని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఇక భారత అభిమానులంతా ధోనీయే మరింత కాలం కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాలని కోరుకుంటున్నారన్నాడు.
ధోని, విరాట్ కోహ్లీల మధ్య ఉన్న కెప్టెన్సీ తేడాలపై అశ్విన్ స్పందించాడు. తనకు కెప్టెన్సీ అప్పగిస్తే ధోనీ, కోహ్లిల నుంచి ఎలాంటి లక్షణాలను తీసుకుంటావని ప్రశ్నించగా తాను ఎవరినీ కాపీ కొట్టబోనని అతను చెప్పాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్సీ గురించి ఆలోచించే స్థితిలో తాను లేనని అశ్విన్ స్పష్టంచేశాడు.
తాను ధోనీ సారథ్యంలో సుమారు ఐదేళ్లు ఆడానని, ఆయన ఎంతో అనుభవంతో మంచి నిర్ణయాలు తీసుకుంటాడని, ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాడని చెప్పుకొచ్చాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 50, 100, 150, 200 వికెట్లు తీసుకున్న బౌలర్గా ఎలా ఫీలవుతున్నారని ప్రశ్నించగా.. అనిల్ భాయ్ (కోచ్ కుంబ్లే) కచ్చితంగా నాపై అసంతృప్తిగా ఉండొచ్చు అని నవ్వుతూ చెప్పాడు.
ఇదిలా ఉంటే గాయం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 10వ సీజన్కు అశ్విన్ దూరమైన సంగతి తెలసిందే.