కోల్కత్తా: భారత్లో తొలిసారి గులాబీ బంతితో జరగనున్న మ్యాచ్కు కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమిస్తున్నట్లు టీమిండియా మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పేర్కొన్నారు. క్యాబ్ ఆధ్వర్యంలో ఈనెల 18 నుంచి 21 వరకు జరగనున్న సూపర్ లీగ్ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్లో గులాబీ బంతిని ఉపయోగించనున్నారు.
ప్లడ్ లైట్ల వెలుగుల కాంతిలో జరగనున్న ఈ మ్యాచ్ను స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ మ్యాచ్ ప్రమోషన్ సందర్భంగా సౌరభ్ గంగూలీ మాట్లాడుతూ భారత్లో పింక్ బంతితో జరగనున్న తొలి డే నైట్ మ్యాచ్కి ఈడెన్ గార్డెన్స్ ఆథిత్యమిస్తుందని చెప్పారు.
ఎన్నో అద్భుతమైన అనుభూతులను అందించిన ఈడెన్ గార్డెన్ ఈ ప్రత్యేకతను కూడా చాటుకుందని అన్నారు. బీసీసీఐ టెక్నికల్ కమిటీ ఛైర్మన్గా ఉన్న గంగూలీ టెస్టు క్రికెట్ భవితవ్యం గులాబీ బంతిపైనే ఆధారపడి ఉందని అన్నారు. ఈ మ్యాచ్ని టిక్కెట్లు లేకుండా ఉచితంగా చూడొచ్చని అన్నారు.
ఈ మ్యాచ్కి అఫీసియల్ బ్రాడ్కాస్టర్గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ కోల్కత్తాలోని స్కూలు విద్యార్ధులకు ఉచితంగా టిక్కెట్లను అందజేస్తుందని తెలిపారు. అయితే రుతుపవనాలను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ని మధ్యాహ్నాం 2.30 గంటల నుంచి ప్రారంభించనునట్టు తెలిపారు.
భారత్ చరిత్రలో ఓ అంకంగా నిలవబోయే ఈ మ్యాచ్కి కామెంటేటర్లుగా హర్షా బోగ్లే, ఆకాశ్ చోప్రా, వీవీఎస్ లక్ష్మణ్లు ఉంటారని తెలిపారు. భారత్-న్యూజిలాండ్ డే నైట్ టెస్ట్ మ్యాచ్కి ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తుందా? అని విలేకరి అడిగిన ఓ ప్రశ్నకు అది బీసీసీఐ షెడ్యూల్ను బట్టి ఉంటుందన్నారు.