హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి బీసీసీఐ మరో కొత్త కీలక బాధ్యతను అప్పగించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బోర్డులో లోధా కమిటీ సిఫారసులను అమలు చేయడానికి ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ ప్రత్యేక కమిటీలో గంగూలీకి చోటు కల్పించారు.
లోధా కమిటీ సిఫార్సుల అమలుపై బీసీసీఐ ప్రత్యేక కమిటీ
ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా ఈ కమిటీకి హెడ్గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ ప్రత్యేక సర్వసభ్య సమావేశం(ఎస్ జీఎమ్)లో ఏడుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ప్రకటించింది. వీరిద్దరితో పాటు బోర్డు కోశాధికారి అనిరుధ్ చౌదరి, తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి, టీసీ మాథ్యూ (కేరళ క్రికెట్), నాబా భటర్జీ (నార్త్ ఈస్ట్ ప్రతినిధి), జే షా(గుజరాత్ క్రికెట్ అసోసియేషన్) లతో పాటు మిగిలిన సభ్యులుగా ఉన్నారు.
ఈ ఏడుగురు సభ్యుల ప్రత్యేక కమిటీ లోధా కమిటీ సిఫారసుల అమలుకు ఉన్న అడ్డంకులపై విశ్లేషించనుంది. అంతేకాదు వాటిని అమలు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా ఓ నివేదిక రూపంలో అందిస్తోంది. ఈ కమిటీ జూన్ 30వ తేదీన సమావేశం కానుంది. ఆ తర్వాత లోధా కమిటీ సిఫారసుల అమలుపై తమ నివేదికను బోర్డు తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నాకు సమర్పించనుంది.
రూ. 2,199 కోట్లతో ఒప్పందం: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వివో
ఇదిలా ఉంటే లోధా కమిటీ సిఫారసుల అమలుపై జులై 14న సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలో జులై 10లోపు ఈ కొత్త కమిటీ తమ పని పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని బోర్డు ఓ ప్రకటనలో కోరింది. ఇదిలా ఉంటే ఈ కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ ఇప్పటికే క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడిగా, బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)లో సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే.