హైదరాబాద్: ఇంగ్లాండ్ చేతిలో తొలి టెస్టు పరాజయానికి దక్షిణాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 340 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్పై ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్ల సిరిస్ను 1-1తో సమం చేసింది.
నాలుగో రోజైన సోమవారం 474 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 44.2 ఓవర్లలో 133 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, మహరాజ్ చెరో 3 వికెట్లు తీయగా... మోరిస్, ఒలీవర్ తలా 2 వికెట్లు తీశారు.
ఏ ఒక్క ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ కూడా అర్ధసెంచరీ చేయలేకపోయాడు. అలిస్టర్ కుక్ చేసిన 42 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. 1/0 ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్, క్రమం తప్పకుండా వికెట్లు చేజార్చుకుంది. ఏ దశలోనూ విజయం దిశగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కొనసాగలేదు.
11 పరుగులకే చివరి ఐదు వికెట్లు కోల్పోయింది. పరుగుల పరంగా చూస్తే దక్షిణాఫ్రికాకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో 96.2 ఓవర్లు ఆడి 335 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 205 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 343 పరుగులు చేసింది.
రెండు ఇన్నింగ్స్లలో కలిపి 96 పరుగులు చేయడంతో పాటు 5 కీలక వికెట్లు తీసిన ఫిలాండర్కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. తొలి టెస్టులో ఇంగ్లాండ్ 211 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడో టెస్టు ఈ నెల 27 నుంచి ఓవల్ మైదానంలో జరుగుతుంది.