హైదరాబాద్: శ్రీలంక మాజీ ఆటగాడు కుమార్ సంగక్కర తాజాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్ కు సైతం వీడ్కోలు చెప్పాడు. ఇంగ్లండ్ కౌంటీ చాంపియన్ షిప్లో భాగంగా సెప్టెంబర్లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడనున్నట్లు సంగక్కర తాజాగా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్కు రెండేళ్ల క్రితమే కుమార సంగక్కర వీడ్కోలు పలికాడు.
'మరికొన్ని నెలల్లో 40వ ఒడిలోకి వెళ్లబోతున్నా. ఇంకా ఆడాలని ఉన్నా శరీరం సహకరించడం లేదు. దాంతో పూర్తిగా క్రికెట్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నా. ఇంగ్లాండ్లో ఆడబోయే కౌంటీ క్రికెట్ నాకు చివరిది' అని సంగక్కర స్పష్టం చేశాడు.
'కొన్ని రోజుల్లో నా క్రికెట్ కెరీర్ ముగుస్తుంది. సుదీర్ఘకాలం పాటు క్రికెట్ ఆడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏదొక రోజు ఆటకు గుడ్ బై చెప్పక తప్పదు. క్రికెటర్లు లేదా క్రీడాకారులకు ఏదో ఒకరోజు ఎక్స్పైరీ ఉంటుందని, అప్పుడు వెళ్లక తప్పదని' 39 ఏళ్ల సంగక్కర బీబీసీకి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పాడు.
2015లో టెస్టు క్రికెట్కు సంగక్కర వీడ్కోలు పలికాడు. 134 టెస్టుల్లో 57.40 యావరేజితో 12,400 పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్కు వీడ్కోలు చెప్పిన 2015లోనే ఇంగ్లీషు కౌంటీల్లో కుమార సంగక్కర సర్రే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో కౌంటీల్లో వెయ్యి పరుగులు సాధించి, మిడిల్ సెక్స్పై రెండు సెంచరీలు చేశాడు.