హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ ప్రపంచంలోని విధ్వంసక క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏబీ డివిలియర్స్ ఒకడు. ఫార్మాట్ ఏదైనా సరే క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలే. అతడి పరుగుల సునామీని ఆపడం ఎవరి తరం కాదు. అంతేనా అతడు సృష్టించే పరుగుల విధ్వంసం ఎవరి అంచనాలకి అందదు.
టీ20ల్లో కేవలం ఒక్క ఓవర్ వ్యవధిలోనే మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన సందర్భాలు అనేకం. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ, గత ఆరు నెలలుగా డివిలియర్స్ అభిమానులు ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీలో కెప్టెన్గా అతను చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఒక్కడి కూడా ఆడలేదు.
ఇదిలా ఉంటే తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో డివిలియర్స్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. 49 బంతుల్లో 50 పరుగులు చేసి దక్షిణాఫ్రికా తరఫున అత్యంత నెమ్మదిగా అర్ధ సెంచరీ చేసిన క్రికెటర్గా నిలిచాడు.
అంతకముందు తన కెరీర్లో 10 ఏళ్ల క్రితం న్యూజిలాండ్పై 43 బంతుల్లో అర్ధసెంచరీని నమోదు చేశాడు. ఇప్పుడు దానితో పోలిస్తే డివిలియర్స్ పరమ చెత్త రికార్డుని నమోదు చేశాడు. టీ20ల్లో ఇప్పటివరకు డివిలియర్స్ 37 అర్ధసెంచరీలు, రెండు సెంచరీలు చేశాడు.
ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ చివరి వరకూ నాటౌట్గా ఉన్నా 58 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 65 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 142 పరుగులే చేయగలిగింది.
ఆ తర్వాత 143 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కేవలం 14.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఇంగ్లాండ్ ఆటగాడు బారిస్టో 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 60 పరుగులు చేశాడు. మునుపటి లాగా డివిలియర్స్ స్వేచ్ఛగా ఆడలేకపోతున్నాడు. గత ఏడాదిగా అతడు వెన్నునొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.