హైదరాబాద్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన సిరిస్లో భావోద్వేగాలను నియంత్రిచలేక కొంత అసహనానికి లోనయ్యానని, ఇందుకు క్షమాపణలు చెబుతున్నానని ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. నాలుగు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది.
ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ చేతిలో ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ మీడియాతో మాట్లాడాడు. 'సిరీస్ అంతా గొడవలు, వివాదాలతో సాగింది. నేను ప్రతిసారీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాను. ఇందుకు క్షమాపణలు చెబుతున్నా' అని స్మిత్ అన్నాడు.
'కెప్టెన్గా ప్రతి మ్యాచ్, సిరీస్లో విజయం సాధించాలనే కోరుకుంటాను. ఆ క్రమంలో తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో కొన్ని మాటలు అనుకోకుండా దొర్లాయి. అంతేకాని ఎవర్నీ ఉద్దేశించి అనలేదు. ఏ ఒక్కరూ వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఆటలో ఇవన్నీ మామూలేనని అందరూ భావించాలి. సొంతగడ్డపై టీమిండియాతో గట్టి పోటీ ఇచ్చాం' అని అన్నాడు.
ఆస్ట్రేలియా విషయానికి వస్తే ఇవి చాలా కఠినమైన రోజులని, భారత్తో గొప్ప సిరీస్ ఆడినందుకు సంతోషంగా ఉందని స్మిత్ పేర్కొన్నాడు. ధర్మశాల మైదానం పేస్, బౌన్స్, స్పిన్కు అనుకూలించిందని. మూడో రోజు ఆటలో తమ జట్టు ఆటగాళ్లు ఎక్కువ సమయం క్రీజులో నిలిస్తే ఫలితం వేరేలా ఉండేదేమో అని స్మిత్ అభిప్రాయపడ్డాడు.
ఇక రెండో ఇన్నింగ్స్లో ఉమేశ్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని స్మిత్ ప్రశంస కురిపించాడు. ఈ సిరీస్ టీమిండియా ఆటగాళ్లు ముఖ్యంగా భారత్ బౌలర్లు రాణించారని స్మిత్ ప్రశంసలు కురిపించాడు. భారత పర్యటనకు వచ్చే ముందు పలువురు ఆసీస్ అభిమానులు 4-0తో భారత్ను వైట్వాష్కు గురి చేయాలని కోరినట్లు స్మిత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.