హైదరాబాద్: టెస్టుల్లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన రికార్డులను ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ అధిగమించాడని ఆసీస్ మాజీ ఆటగాడు బ్రాడ్ హాడ్జ్ పేర్కొన్నాడు. ధర్మశాల వేదికగా భారత్తో జరుగుతున్న చివరి టెస్టులో స్టీవ్ స్మిత్ 20వ టెస్టు సెంచరీని చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రాడ్ హాడ్జ్ ఫాక్స్ స్పోర్ట్స్ న్యూస్కు ఇంటర్యూ ఇచ్చాడు. అందులో స్టీవ్ స్మిత్ ఇదే ఫామ్ని కొనసాగించినట్లైతే టెస్టుల్లో 40 లేదా 50 సెంచరీలు నమోదు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ప్రతి మూడు టెస్టుల్లో స్మిత్ సెంచరీ చేస్తున్న వైనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.
'40 లేదా 50 అనేది స్మిత్కు నెంబర్ మాత్రమే. అతడు సూపర్ స్టార్. క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్లను స్మిత్ తప్పక చేరుకుంటాడు' అని హాడ్జ్ తెలిపాడు. టెస్టుల్లో 20 సెంచరీలు చేసేందుకు ఎంతో కృషి, నైపుణ్యం కావాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం టెస్టుల్లో స్మిత్ హవా నడుస్తోందని, అతడు అప్పక క్రికెట్ దిగ్గజాల సరసన చేరుతాడనే ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం స్మిత్ ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్గా జట్టుని ముందుండి నడిపిస్తున్నాడని పేర్కొన్నాడు. కాగా, టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (200 టెస్టుల్లో 51) సెంచరీలతో మొదటి స్దానంలో నిలవగా, ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన జాక్వస్ కల్లిస్ (166 టెస్టుల్లో 45), ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ (168 టెస్టుల్లో 41) మూడో స్ధానంలో ఉన్నాడు.