హైదరాబాద్: టీమిండియాతో పూణెలో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఐసీసీ టెస్టు ర్యాంకుల్లో దూసుకెళ్లారు. పూణె టెస్టులో సెంచరీ సాధించిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లతో నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు.
ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న స్మిత్ ఖాతాలో ప్రస్తుతం 939 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. తద్వారా టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆల్ టైమ్ జాబితాలో స్మిత్ ఆరో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్ లెజెండ్ డాన్ బ్రాడ్మన్ (961) అగ్రస్థానంలో ఉన్నాడు.
ఆ తర్వాత లెన్ హటన్ (945), జాక్ హబ్స్ (942), రికీ పాంటింగ్ (942), పీటర్ మే (941)లు ఉన్నారు. బ్యాటింగ్ దిగ్గజాలైన గ్యారీ సోబర్స్, వివ్ రిచర్డ్స్, సంగక్కర తమ కెరీర్లో అత్యుత్తమంగా 938 రేటింగ్ పాయింట్లు సాధించగా, స్మిత్ తాజాగా వీరిని అధిగమించాడు.
ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో స్ధానంలో నిలిచాడు. కోహ్లీ ఖాతాలో 873 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. రెన్షా ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 34వ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. పూణె టెస్టులో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించిన స్టీవ్ ఒకీఫ్ 33 స్థానాలు ఎగబాకి 29వ ర్యాంకులో నిలిచాడు.
బ్యాటింగ్ జాబితాలో భారత్ ఓపెనర్ లోకేష్ రాహుల్ 11 స్థానాలను మెరుగుపరుచుకుని కెరీర్ లోనే అత్యుత్తమ 46వ ర్యాంకులో కొనసాగుతున్నాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ మాత్రం మూడు స్థానాలు దిగజారి 30వ ర్యాంకుకు పడిపోయాడు. మిడిలార్డర్ బ్యాట్స్మన్ రహానె 15 నుంచి 17వ ర్యాంక్కు చేరాడు.
బౌలర్ల ర్యాంకింగ్స్లో 878 రేటింగ్ పాయింట్లతో అశ్విన్ నెంబర్ వన్ ర్యాంక్లో కొనసాగుతున్నాడు. జడేజా మాత్రం రెండో ర్యాంక్ నుంచి మూడో స్థానానికి పడిపోయాడు. పేసర్ ఉమేష్ యాదవ్ ఏడు ర్యాంక్లు ఎగబాకి 30వ స్థానంలో నిలిచాడు. ఆల్రౌండ్ విభాగంలో అశ్విన్, షకీబ్ ఉల్ హాసన్, జడేజా టాప్ మొదటి మూడు స్ధానాల్లో ఉన్నారు.