హైదరాబాద్: ఛాంపియన్స్ ట్రోఫీలో లీగ్ దశలోనే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టడంతో తమకు దొరికిన సమయాన్ని ఆసీస్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఎంచక్కా అమెరికాలో బేస్ బాల్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
న్యూయార్క్ యాంకీ మ్యాచ్ని వీక్షించేందుకు స్టీవ్ స్మిత్ అమెరికా వెళ్లాడు. ఇండోర్ స్టేడియంలో బేస్ బాల్ ప్రాక్టీస్ చేసిన వీడియోని కూడా స్మిత్ తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సాధారణంగా స్మిత్ కుడి చేతివాటం బ్యాట్స్మెన్ అని మనకు తెలిసిందే.
అయితే ఈ వీడియోలో కుడి చేతితో పాటు ఎడమ చేతితో కూడా స్మిత్ ప్రాక్టీస్ చేయడం కనిపించింది. అయితే ఒక్క బంతిని కూడా వదలకుండా స్మిత్ ఆడిన షాట్లు అభిమానులను అలరిస్తున్నాయి. అయితే క్రికెట్ బ్యాటుతో కాకుండా సన్నగా ఉండే బేస్బాల్ బ్యాటుతో ఒక్క బాల్ కూడా మిస్ కాకుండా స్మిత్ కొట్టడం విశేషం.
టెస్టుల్లో నెంబర్ వన్ బ్యాట్స్మన్గా కొనసాగుతున్న స్మిత్ వన్డేల్లో 13వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్కు కెప్టెన్గా కూడా వ్వవహరిస్తున్నాడు. గతేడాది బోస్టన్లో రెడ్ సాక్స్ జట్టుకు చెందిన రెండో బేస్ స్టార్ డస్టింగ్ పెట్రోడియాను కలిసిన సంగతి తెలిసిందే. మరోవైపు క్రికెట్ ఆస్ట్రేలియాతో జీతాల కోసం సాగుతున్న గొడవ ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు.
జులై 1 నుంచి ఆస్ట్రేలియా క్రికెటర్ల కొత్త కాంట్రాక్టులు ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటిలోగా ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మధ్య ఓ ఒప్పందం కుదరడం దాదాపు అసాధ్యమని ఏసీఏ ప్రతినిధి గ్రెగ్ కంబెట్ స్పష్టం చేశాడు. జూన్ 30తో ప్రస్తుత ఒప్పందం ముగియనుంది.
కనీస అవసరాల విషయంలో ప్లేయర్స్కి, క్రికెట్ బోర్డుకి మధ్య చర్చలు సఫలం కాలేదని, దీంతో నిరుద్యోగులుగా కావడానికి ప్లేయర్స్ను మానసికంగా సిద్ధం చేశామని గ్రెగ్ కంబెట్ చెప్పాడు. దీంతో జులై 1న సుమారు 200 మంది వరకు ఆస్ట్రేలియా క్రికెటర్లు తమ ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
బోర్డు ఆదాయంలో కొంత వాటాను తమకు ఇవ్వాలని ఆసీస్ ఆటగాళ్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఓ కొత్త ప్రతిపాదనతో సీఏ ముందుకు వచ్చినా ఆసీస్ ఆటగాళ్లు నిరాకరించారు. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్ పర్యటన, ఆ తర్వాత ఇండియాతో వన్డే సిరీస్, ఏడాది చివర్లో జరగాల్సిన యాషెస్ సిరీస్ జరగడం అనుమానమే అంటున్నారు.