హైదరాబాద్: విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా తన కలలను సాకారం చేస్తోందని బ్యాటింగ్ లెజెండ్ సునీల్ గవాస్కర్ అన్నాడు. తన పుస్తకం 'సన్నీ డేస్'కు 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పూణెలో స్పోర్ట్స్ లిటరరీ ఫెస్టివల్లో గవాస్కర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన లక్ష్యాలను, ఆశయాలను విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు సాధిస్తుందని చెప్పాడు.
టెస్టుల్లో వరుస విజయాలతో జట్టు దూసుకెళ్తుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 'కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా గొప్పగా ఆడుతోంది. టెస్టుల్లో ఆ విజయపరంపర అద్భుతం. వాళ్లు నా కలలను నిజం చేస్తున్నారు' అని గవాస్కర్ చెప్పాడు. సెహ్వాగ్ తాను అనుకున్నట్లుగా బంతిని పవర్ ఫుల్గా కొట్టేవాడని సన్నీ అన్నాడు.
''వీరేంద్ర సెహ్వాగ్, నా బ్యాటింగ్ శైలి ఒకే తీరుగా ఉండేది. టెస్టుల్లో తొలి బంతిని స్ట్రెయిట్ సిక్సర్ గా మలచాలని ఎప్పుడూ తాపత్రయ పడేవాడిని. ఓసారి ఈ ఫీట్ సాధించాను. కానీ సెహ్వాగ్ మాత్రం చాలాసార్లు ఇలాంటి ఫీట్లను మన ముందు ఆవిష్కరించాడు. బ్యాటింగ్లో గట్స్ ఉన్న భారత క్రికెటర్లలో సెహ్వాగ్ ఒకడు' అని గవాస్కర్ చెప్పాడు.
ఇక టీ20 ఫార్మాట్తో టెస్టు క్రికెట్కు ఎటువంటి నష్టం లేదని గవాస్కర్ తేల్చి చెప్పాడు. క్రికెట్కు టీ20లు ఎంతో మేలు చేశాయియని. ఏది ఏమైనా ఆటగాడి నైపుణ్యాన్ని చెప్పాలంటే టెస్టు గణాంకాలను ఆధారంగా తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఇక భారత క్రికెట్ చరిత్రలో కపిల్ దేవే గొప్ప మ్యాచ్ విన్నరని అన్నాడు.